Pawan Kalyan: విజయనగరం జిల్లా చెరకు రైతులకు తక్షణమే బకాయిలు ఇప్పించాలి: పవన్ కల్యాణ్ డిమాండ్

Pawan Kalyan supports sugarcane farmers in Vijayanagaram district
  • విజయనగరం చెరకు రైతులకు పవన్ మద్దతు
  • బకాయిల కోసం ఆందోళన చేస్తున్న రైతులు
  • రూ.16 కోట్ల మేర బకాయిల కోసం పోరాటం
  • రైతులను మోసం చేస్తున్నారంటూ పవన్ ఆగ్రహం
విజయనగరం జిల్లా ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద బకాయిల కోసం ఆందోళన చేపడుతున్న రైతులకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. మనకు తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు నింపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద రైతులు తమకు రావాల్సిన బకాయిల కోసం నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారని అన్నారు. అయితే ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోవడంతోనే సమస్య తీవ్రమైందని తెలిపారు.

గత రెండేళ్ల నుంచి చెరకు రైతులకు రూ.16.38 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని పవన్ వివరించారు. తమకు రావాల్సిన బకాయిల కోసం రైతులు చేస్తున్న పోరాటాన్ని పాలనా యంత్రాంగం శాంతిభద్రతల సమస్యగా చూడడం సరికాదని హితవు పలికారు. రైతులను అరెస్ట్ చేయడం ద్వారా వారిలో ఆగ్రహాన్ని పెంచారని పేర్కొన్నారు.

తక్షణమే బకాయిలు ఇప్పించాల్సిన సర్కారు, జనవరిలో చెల్లింపులు చేసేలా చక్కెర కర్మాగారం యాజమాన్యాన్ని ఒప్పిస్తామని చెప్పడం రైతులను మోసగించడమేనని పవన్ విమర్శించారు. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా బకాయిలు ఇప్పించే వెసులుబాటు ఉన్నా, ఈ చట్టాన్ని ప్రభుత్వం వినియోగించకపోవడంపై సందేహాలు కలుగుతున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Pawan Kalyan
Sugarcane
Farmers
Pending Bills
Vijayanagaram District
Janasena

More Telugu News