AP High Court: సీబీఐపై ఏపీ హైకోర్టు ఆగ్రహం.. పంచ్ ప్రభాకర్ ను ఎలా పట్టుకుంటారో చెప్పాలని ప్రశ్నించిన ధర్మాసనం!

  • న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు
  • ఈరోజు అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు
  • అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని వ్యాఖ్య
AP High Court fires on CBI

న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసును విచారిస్తున్న సీబీఐపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంపై హైకోర్టు ధర్మాసనం ఈరోజు అత్యవసరంగా విచారించింది. విచారణ సందర్భంగా స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీ కుమార్ మాట్లాడుతూ రిజిస్ట్రార్ జనరల్ నుంచి లెటర్ వచ్చిన వెంటనే యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి పంచ్ ప్రభాకర్ పోస్టును తొలగించి, బ్లాక్ చేశారని చెప్పారు.

మరోపక్క, తాము కూడా లేఖ రాశామని సీబీఐ తెలిపింది. దీంతో ధర్మాసనం స్పందిస్తూ... లేఖ రాయడం వల్ల ఉపయోగం ఏముందని ప్రశ్నించింది. పంచ్ ప్రభాకర్ ను ఎలా పట్టుకుంటారో చెప్పాలని వ్యాఖ్యానించింది. సీబీఐ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాము చెప్పింది వినకపోతే... మీరు చెప్పేది కూడా మేము వినబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏం చేయాలో తామే ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. కోర్టులో విచారణ ప్రారంభమైన తర్వాత కూడా పంచ్ ప్రభాకర్ గూగుల్ లో తన ఫొటోతో సహా చిరునామాను ఉంచారని ధర్మాసనం దృష్టికి అశ్వినీ కుమార్ తీసుకొచ్చారు. దీంతో, ఈ కేసును ఎలా డీల్ చేయాలో తమకు తెలుసని కోర్టు వ్యాఖ్యానించింది. సాయంత్రానికల్లా తగు ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది.

More Telugu News