ఆర్థిక వ్యవస్థ కుదేలైనా.. రైతులకు సహాయం విషయంలో మేం వెనక్కి తగ్గలేదు: ఏపీ సీఎం జగన్​

AP CM Jagan Releases Rythu Bharosa Funds
  • కరోనా సమయంలోనూ పథకాలు అమలు చేశామన్న జగన్
  • వైఎస్సార్ రైతు భరోసా, యంత్రసేవా, సున్నా వడ్డీ నిధుల విడుదల
  • రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు
  • ఇప్పటిదాకా రూ.18,777 కోట్లు ఇచ్చామని వెల్లడి
  • గత ప్రభుత్వ బాకీలను చెల్లించామంటూ కామెంట్
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మూడో ఏడాది రెండో విడత రైతు భరోసా నిధులను ఆయన ఇవాళ విడుదల చేశారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద రూ.2,190 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.  

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు భరోసా కింద ఇప్పటిదాకా రూ.18,777 కోట్లు విడుదల చేశామని చెప్పారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.1,180 కోట్ల బకాయిలనూ తాము చెల్లించామన్నారు.

కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా తాము వెనక్కు తగ్గలేదన్నారు. కరవు సీమలోనూ సాగునీరు పారిస్తున్నామని చెప్పారు. 29 నెలల పాలనలో ఎన్నో మార్పులను తీసుకొచ్చామని, వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పుడు రూ.2,134 కోట్లతో యంత్ర సేవా కేంద్రాలనూ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు.

కాగా, ప్రభుత్వం 50.37 లక్షల మంది రైతులకు రైతు భరోసాను, 6.67 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాలను అందిస్తోంది. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.25.55 కోట్లు ఇవ్వనున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
YS Jagan
YSR Rythu Bharosa

More Telugu News