Dwarampudi Chandrasekhar Reddy: కాకినాడలోనే పట్టాభిపై దాడి చేయాలని నిర్ణయించాం.. అప్పుడు టీడీపీ ఆస్తులను మేమే ధ్వంసం చేశాం: ఎమ్మెల్యే ద్వారంపూడి

  • జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే ద్వారంపూడి
  • చంద్రబాబు వద్ద బ్రిటిషర్ల లక్షణాలు ఉన్నాయి
  • చంద్రబాబు దీక్షపై మరుగుదొడ్డిలోనూ నిఘా పెట్టాలి
  • పవన్ జనసేన సింహమైతే సింగిల్‌గా రావాలి
Dwarampudi Chandrasekhar Reddy says wanted to attack on pattabhi in kakinada

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై కాకినాడలోనే దాడి చేయాలని నిర్ణయించామని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. అయితే, అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతోనే ఆగామని అన్నారు. కాకినాడలో నిన్న నిర్వహించిన జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు వద్ద బ్రిటిషర్ల లక్షణాలు ఉన్నాయని, కులాలు, వర్గాలు, గ్రూపులను విడగొడతారని ఆరోపించారు. చంద్రబాబు దీక్షపై మరుగుదొడ్డిలోనూ నిఘాపెట్టాలని అన్నారు.

తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. జగన్‌ను విమర్శించేందుకు ఏ కారణం లేదని, అందుకనే తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా ద్వారంపూడి నిప్పులు చెరిగారు. పవన్ కనుక జనసేన సింహం అయితే సింగిల్‌గా పోటీ చేయాలని సవాలు విసిరారు. ఆయన ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతామన్నారు.  

ప్యాకేజీలకు అలవాటుపడి చంద్రబాబుకు తొత్తుగా మారితే జాతి ఆయనను క్షమించదన్నారు. తాము రంగా శిష్యులమని, ఆయనను చంపినప్పుడు తాము ఊరుకోలేదని, కాకినాడలో టీడీపీ నాయకుల ఆస్తులను ధ్వంసం చేశామని అన్నారు. అలాంటిది జగన్‌ను తిడితే ఎందుకు ఊరుకుంటామని ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రశ్నించారు.

More Telugu News