Telangana: ఆర్‌డీఎస్‌ పనులు త్వరగా పూర్తి చేసి నీరు అందించాలి: తుంగభద్ర బోర్డుకు తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్ లేఖ

  • 2 టీఎంసీల నీరు కోరుతూ లేఖ రాసిన ఏపీ
  •  ఇది కృష్ణ నీటి వివాదం
  • ట్రైబ్యునల్-1 అవార్డ్‌కు విరుద్ధమని వెల్లడి 
Telangana Engineer in Chief letter to Tungabhadra board

తుంగభద్ర బోర్డు సెక్రెటరీకి తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. ఇటీవల తుంగభద్ర నీటి విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ గురించి మురళీధర్ తన లేఖలో ప్రస్తావించారు. తుంగభద్ర నీటి కేటాయింపుల్లో ఆర్‌డీఎస్‌కి రావాల్సిన 15.9 టీఎంసీ నీటిలో కేవలం 5, 6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని ఆయన తెలిపారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తుంగభద్ర నీటితోపాటు శ్రీశైలం నుంచి కూడా కృష్ణా నీటిని యథేచ్ఛగా తరలిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు గతంలోనే 2 టీఎంసీల నీటిని విడుదల చేశారని, కానీ ఏపీ ప్రభుత్వం మరోసారి కేసీ కెనాల్‌ కోటా 2 టీఎంసీల నీటిని టీబీఆర్‌బీ హెచ్‌ఎల్‌సీకి విడుదల చేయాలని కోరిందని చెప్పారు. ఇది కృష్ణ నీటి వివాదం ట్రైబ్యునల్-1 అవార్డ్‌కు విరుద్ధమైన డిమాండ్‌ అని వెల్లడించారు.

ఈ నీటిని విడుదల చేస్తే ఇప్పటికే నీటి లభ్యత తక్కువగా ఉన్న ఆర్‌డీఎస్‌కు మరింత అన్యాయం జరుగుతుందని తెలియజేశారు. ఈ క్రమంలో ఆర్‌డీఎస్‌ ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తి చేసి, పూర్తి స్థాయిలో నీటిని అందించాలని తన లేఖలో తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్ సి. మురళీధర్ విజ్ఞప్తి చేశారు

More Telugu News