RCB: ఐపీఎల్‌లో ఎదురులేని చెన్నై.. కొనసాగుతున్న దూకుడు

  • ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో విజయం
  • ఏడో విజయంతో అగ్రస్థానంలో కొనసాగుతున్న ధోనీ టీం
  • ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు
CSK ease home in a tricky chase

షార్జా వేదికగా జరిగిన ఐపీఎల్ 35వ మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోమారు ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఏడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత ఆర్సీబీని 156 పరుగులకే కట్టడి చేసిన చెన్నై 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

రుతురాజ్ గైక్వాడ్ (38), ఫా డుప్లెసిస్ (31), మొయీన్ అలీ (23), అంబటి రాయుడు (32) రాణించారు. సురేశ్ రైనా 17( నాటౌట్), ధోనీ 11 (నాటౌట్) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 2, చాహల్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ తీసుకున్నారు.
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జోరు చూసిన ప్రతి ఒక్కరు స్కోరు 200 పరుగులు దాటుతుందని భావించారు. కోహ్లీ (53), పడిక్కల్ (70) జోడీ మైదానంలో తుపాను సృష్టించింది. అయితే, వీరిద్దరూ అవుటైన తర్వాత స్కోరు అమాంతం జారిపోయింది. తొలి వికెట్ కు 13.2 ఓవర్లలో 111 పరుగులు జోడించిన బెంగళూరు జట్టు... ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరంభంలో కోహ్లీ, పడిక్కల్ విజృంభణతో అదిరిపోయిన బౌలర్లు చివర్లో వరుస వికెట్లు తీస్తూ భారీ స్కోరు చేయకుండా అద్భుతంగా కట్టడి చేశారు.

కోహ్లీ, పడిక్కల్ అవుటైన తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ అదే ఊపు కొనసాగించలేకపోయారు. డివిలియర్స్ 12, మ్యాక్స్ వెల్ 11, టిమ్ డేవిడ్ 1, హర్షల్ పటేల్ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో డ్వేన్ బ్రావో 3, శార్దూల్ ఠాకూర్ 2, దీపక్ చాహర్ ఓ వికెట్ తీశారు. రవీంద్ర జడేజా వికెట్లు తీయకపోయినా బెంగళూరు పరుగుల ప్రవాహాన్ని నిలువరించాడు. మూడు వికెట్లు తీసి బెంగళూరు పతనాన్ని శాసించిన బ్రావోకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ కేపిటల్స్-రాజస్థాన్ రాయల్స్, సాయంత్రం 7.30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతాయి.

More Telugu News