NEET: నీట్ చుట్టూ తమిళ రాజకీయం.. అధికార పార్టీపై బీజేపీ ఫైర్

  • నీట్ పరీక్షకు వ్యతిరేకంగా పెట్టిన బిల్లుకు బీజేపీ మినహా అన్ని పార్టీల మద్దతు
  • విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విన్నపం
  • పరిస్థితిని తాము సరిదిద్దుతామని వ్యాఖ్య
BJP blames DMK for politicising NEET

నీట్ పరీక్షల అంశాన్ని స్టాలిన్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని తమిళనాడు బీజేపీ మండిపడింది. నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో పెట్టిన బిల్లుకు అధికార డీఎంకే సహా ప్రతిపక్ష అన్నాడీఎంకే ఇతర పార్టీలు మద్దతు పలికాయి. బీజేపీ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించింది. అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

కొన్ని రోజుల క్రితం ధనుష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని, అనంతరం కనిమొళి అనే అమ్మాయి కూడా ఆత్మహత్యకు పాల్పడిందని అన్నామలై చెప్పారు. ఇలా చేయవద్దని విద్యార్థులందరినీ కోరుతున్నానని అన్నారు. రాష్ట్రంలో నీట్ చుట్టూ రాజకీయం జరుగుతోందని.. దీన్ని తాము సరిదిద్దుతామని చెప్పారు.

విద్యార్థుల జీవితాలు ఏమైపోయినా రాజకీయ పార్టీలకు అవసరం లేదని దుయ్యబట్టారు. తమిళనాడులో నీట్ పరీక్ష జరగదని చెప్పి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఆపేశారని... చివరి నిమిషంలో నీట్ పరీక్ష జరుగుతుందని చెప్పారని మండిపడ్డారు. దీనివల్ల విద్యార్థులు ఎంత ఇబ్బంది పడివుంటారో ఊహించుకోవాలని అన్నారు. ఈ విషయాన్ని తమిళ ప్రజలు, బీజేపీ మరిచిపోదని చెప్పారు.

More Telugu News