Yogi Adityanath: "అబ్బా జాన్" అంటూ ఓ వర్గం వారిపై యూపీ సీఎం పరోక్ష వ్యాఖ్యలు... మండిపడుతున్న విపక్షాలు

  • లక్నోలో నిన్న కార్యక్రమం
  • పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్
  • ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు
  • విద్వేషం వెళ్లగక్కందే ఎన్నికలకు వెళ్లలేరా అంటూ ఒమర్ వ్యాఖ్యలు
Uttar Pradesh CM Yogi Adithyanath comments creates outrage

ఓ సామాజిక వర్గం వారిని ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. లక్నోలోని ఖుషీ నగర్ లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ, అబ్బా జాన్ అని పిలుచుకునేవారు రేషన్ సౌకర్యాన్ని బాగా వినియోగించుకునేవారని, 2017 ముందువరకు ఆ సరుకులు దేశ సరిహద్దులు దాటి నేపాల్, బంగ్లాదేశ్ వెళ్లేవని అన్నారు. ఇవాళ ఆ పరిస్థితులను అరికట్టామని, అక్రమ రేషన్ పొందేవారిని జైల్లో వేస్తున్నామని తెలిపారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం యోగిపై నేషనల్ కాన్ఫరెన్స్, బీఎస్పీ, సమాజ్ వాదీ తదితర రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, ముస్లింలపై విద్వేషం వెళ్లగక్కకుండా బీజేపీ ఏ ఎన్నికలకు వెళ్లదా? అని ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితి చూస్తే అలాగే ఉందని విమర్శించారు. హిందువుల రేషన్ ను ముస్లింలు తింటున్నారని ఓ సీఎం చెప్పడం, ఆయనే స్వయంగా ఓట్లు అడగడం ఈ వీడియోలో చూడండి అని పేర్కొన్నారు. ఈ మేరకు యూపీ సీఎం మాట్లాడిన మాటల తాలూకు వీడియోను ఒమర్ పంచుకున్నారు.

More Telugu News