Electricity Bill: కోట్లలో వచ్చిన కరెంటు బిల్లు చూసి దిగ్భ్రాంతికి గురైన టిఫిన్ హోటల్ యజమాని

  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
  • టిఫిన్ హోటల్ కు రూ.21 కోట్ల బిల్లు
  • అధికారులకు ఫిర్యాదు చేసిన మహిళ
  • మీటర్ రీడింగ్ ఉద్యోగిని, ఏఈని సస్పెండ్ చేసిన వైనం
Electricity bill in crores

సాధారణంగా చిన్నా చితకా హోటళ్లకు, నివాస గృహాలకు ఓ వెయ్యిలోపు కరెంటు బిల్లులు వస్తుంటాయి. మహా అయితే ఇంకో ఐదు వందలు ఎక్కువ వస్తుందేమో! కానీ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఓ టిఫిన్ హోటల్ కు వచ్చిన కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే దిగ్భ్రాంతికి గురవుతారు. ఆ కరెంటు బిల్లు చూసిన టిఫిన్ హోటల్ నిర్వాహకురాలి పరిస్థితి కూడా అదే. సెప్టెంబరు మాసానికి రూ.21 కోట్ల మేర బిల్లు వేశారు. దాంతో ఆమె లబోదిబోమన్నారు.

వెంటనే ఈ సంగతి విద్యుత్ శాఖ అధికారులకు నివేదించడంతో వారు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆమె బిల్లును సరిచేసి కొత్త బిల్లు అందించేందుకు చర్యలు చేపట్టారు. అధికారులు భరోసా ఇచ్చిన తర్వాత గానీ ఆమె కుదుటపడలేదు.

ఈ బిల్లు తీయడంలో నిర్లక్ష్యం వహించాడంటూ చింతలపూడి మీటర్ రీడింగ్ ఉద్యోగి ప్రభాకర్ తో పాటు ఆ ప్రాంత ఏఈపైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సాంకేతికలోపం కారణంగానే ఇలాంటి బిల్లులు వస్తుంటాయని అధికారులు వివరించారు.

More Telugu News