Afghanistan: ఆఫ్ఘ‌న్‌లో పాకిస్థాన్‌ చర్యలను భారత్, అమెరికా గమనిస్తున్నాయి: భార‌త్‌

  • భార‌త్ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల తాలిబ‌న్లు సానుకూలంగా స్పందించే చాన్స్
  • ఆఫ్ఘ‌న్‌లో పరిస్థితులు  అస్థిరంగా ఉన్నాయి
  • ఆ దేశం ప‌ట్ల‌ అమెరికాది, మాది వేచి చూసే ధోరణి
we are observing situation in afghan

ఆఫ్ఘ‌నిస్థాన్‌ తాలిబ‌న్ల వ‌శ‌మైన నేప‌థ్యంలో భార‌త్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా స్పందిస్తూ... భార‌త్ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల సానుకూలంగా స్పందిస్తామన్న‌ట్లు తాలిబన్ల నుంచి సూచ‌న‌లు వ‌చ్చాయని చెప్పారు.

ఆఫ్ఘ‌న్‌లో పాకిస్థాన్‌ చర్యలను భారత్ తో పాటు అమెరికా గమనిస్తున్నాయని తెలిపారు. ఆఫ్ఘ‌న్‌లో పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయన్నారు. ఆ దేశం ప‌ట్ల‌ అమెరికా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోందని తెలిపారు. భారత్ కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తోందని చెప్పారు.

ఆఫ్ఘ‌న్‌లో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయ‌ని,  వాటి ప‌ర్య‌వ‌సానాలు ఎలా ఉంటాయో గమనిస్తున్నామని తెలిపారు. తాలిబన్లతో భారత్‌ సంబంధాలు పరిమితమని ఆయ‌న చెప్పారు. తాలిబ‌న్ల‌తో జ‌రిపిన చ‌ర్చ‌ల్లో ఏ విషయంపైనా విస్తృత స్థాయిలో మాట్లాడ‌లేద‌ని తెలిపారు.  

ఆఫ్ఘ‌న్‌ ఉగ్రవాదుల‌ అడ్డాగా మారుతుందేమోనన్న విష‌యంపై మాత్రం భారత్ వ్య‌క్తం చేస్తోన్న‌ ఆందోళనపై సానుకూలంగా స్పందిస్తామని తాలిబన్లు అన్నార‌ని చెప్పారు. ఆఫ్ఘ‌న్‌లో ఎన్నో శక్తులకు పాక్‌ అండగా నిలిచిందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో ఉన్న  జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర‌ సంస్థలు ఆఫ్ఘ‌న్‌లోకి స్వేచ్ఛగా ప్రవేశిస్తున్నాయని తెలిపారు.

వారి కదలికలపై నిఘా ఉంచామని చెప్పారు. ఆ దేశం నుంచి ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు జ‌రిగినా ఆ బాధ్య‌త‌ తాలిబన్లదేన‌ని తెలిపారు. భారత్, అమెరికా మధ్య నాలుగో వార్షిక చర్చలు నవంబర్‌లో వాషింగ్టన్‌లో జరుగుతాయని ఆయ‌న చెప్పారు. ఇందులో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్ పాల్గొన‌నున్నార‌ని తెలిపారు.


More Telugu News