Neeraj Chopra: నా మాటలపై రచ్చ చేయకండి: నీరజ్ చోప్రా విజ్ఞప్తి

  • ఫైనల్స్‌లో తొలి త్రో హడావుడిగా వేశానన్న నీరజ్  
  • తన జావెలిన్ అర్షద్ నదీం చేతిలో ఉండడమే కారణమని వ్యాఖ్య  
  • అందుకే హడావుడిగా మొదటి త్రో వేశానన్న గోల్డ్ మెడలిస్ట్
  • అలా తీసుకోవడం తప్పేమీ కాదని వివరణ 
  • పాక్ ప్లేయర్ అర్షద్ పై నెట్టింట దుమారం  
Do not fuss over my words Neeraj Chopra

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. తాజాగా ఒక వివాదానికి తెరలేపాడు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు నీరజ్ ఇంటర్వ్యూ ఇస్తూ.. ఫైనల్స్‌లో తన తొలి త్రో హడావుడిగా వేశానని చెప్పాడు. దీనికి కారణం తన జావెలిన్ కనిపించకపోవడమేనని, తీరా చూస్తే అది పాకిస్థాన్ ప్లేయర్ అర్షద్ నదీం చేతిలో ఉందని నీరజ్ వెల్లడించాడు. అందుకే తను మొదటి త్రోకు రావడం ఆలస్యమై హడావుడిగా జావెలిన్ విసరాల్సి వచ్చిందని వివరించాడు.

అంతే.. ఆ వెంటనే సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది. అర్షద్‌ను విలన్‌గా చిత్రీకరిస్తూ కొంతమంది కామెంట్లు చేశారు. ఈ క్రమంలో వివాదంపై స్పందించిన నీరజ్.. తన మాటలు అడ్డుపెట్టుకొని రచ్చ చేయొద్దని కోరాడు. తన జావెలిన్ ను అర్షద్ తీసుకోవడం తప్పేమీ కాదని, అది రూల్స్‌కు విరుద్ధం కూడా కాదని స్పష్టం చేశాడు.

‘‘అందరి వ్యక్తిగత జావెలిన్స్ ఒక చోటే ఉన్నాయి. వాటిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. అది రూల్. కాబట్టి, నా జావెలిన్‌ను అర్షద్ తీసుకోవడం తప్పేం కాదు. నేను అడగ్గానే అతను దాన్ని తిరిగిచ్చేశాడు. ఈ విషయంపై ఇంత గొడవ జరగడం నిజంగా బాధాకరం’’ అని నీరజ్ పేర్కొన్నాడు.

కాగా, ఒలింపిక్స్‌ ఫైనల్స్‌లో తొలి త్రోను 87.03 మీటర్లు విసిరిన నీరజ్.. ఆ తర్వాత రెండోసారి ఏకంగా 87.58 మీటర్లు జావెలిన్ విసిరి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత ఏ ఆటగాడూ నీరజ్‌ దరిదాపుల్లోకి కూడా రాలేకపోవడంతో.. భారత్ తరఫున అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగా నీరజ్ చరిత్ర సృష్టించాడు.

More Telugu News