CM Jagan: సీఎం జగన్ కొవిడ్ సమీక్ష... వివరాలు ఇవిగో!

  • కరోనా పరిస్థితులపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
  • కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం
  • కరోనా తగ్గింది కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచన  
  • మార్గదర్శకాలు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశం
CM Jagan video conference over covid situations

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న వైనంపై సీఎం జగన్ మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ ముప్పు తొలగిపోలేదని, అప్రమత్తంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. కేసుల సంఖ్యతో సంబంధం లేకుండా అధికారులు నిత్యం పర్యవేక్షణ, సమీక్షలు జరుపుతుండాలని ఆదేశించారు. కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయని పేర్కొన్నారు.

రోజువారీ కేసుల సగటు 1,300కి వచ్చినప్పటికీ, ఉదాసీనతకు చోటివ్వరాదని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్ పై స్పష్టత లేదని, అధికారులు సర్వసన్నద్ధతతో ఉండాలని వివరించారు. పాజిటివిటీ రేటు, రికవరీ రేటు గణాంకాలు, అంకెలను అధికారులు పట్టించుకోవద్దని, కరోనా మార్గదర్శకాల అమలులో ఏమరుపాటుకు తావివ్వరాదని నిర్దేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాల్లో ఆదేశాలు జారీ చేశారు.

  • కరోనా మార్గదర్శకాలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలి.
  • వివాహాది శుభకార్యాల్లో 150 మందికి మించరాదు.
  • విద్యాసంస్థల్లో కరోనా నియమావళి తప్పకుండా పాటించాలి. విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే స్కూల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలి. సదరు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలి.
  • 104 టోల్ ఫ్రీ నెంబరు ద్వారా సకల సేవలు అందించాలి. కరోనా తగ్గింది కదా అని అలసత్వంతో వ్యవహరించరాదు.
  • 85 శాతం ప్రజలు వ్యాక్సిన్ రెండు డోసులు పొందేంత వరకు అన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
  • అత్యధికంగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి కేంద్రీకరించాలి.
  • వర్షాకాలం వస్తోంది. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఉండాలి.


More Telugu News