BC Commission: తెలంగాణ బీసీ కమిషన్ కొత్త చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

  • ముగిసిన తొలి కమిషన్ పదవీ కాలం
  • హైకోర్టు ఆదేశాలతో కొత్త కమిషన్ ఏర్పాటు
  • సభ్యులుగా కె.కిశోర్‌గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద పటేల్‌
Vakulabharanam Krishnamohan Rao appointed as BC Commission Chairman

తెలంగాణ బీసీ కమిషన్ కొత్త చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు (51)ను ప్రభుత్వం నియమించింది. అలాగే కె.కిశోర్‌గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద పటేల్‌ను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేసింది. బీఎస్ రాములు అధ్యక్షతన ఏర్పాటైన తొలి కమిషన్ పదవీ కాలం ముగియడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మూడేళ్లపాటు ఈ కమిషన్ పనిచేస్తుంది. కృష్ణమోహన్ గతంలో మూడుసార్లు కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. ఇందులో రెండుసార్లు ఉమ్మడి ఏపీలో కాగా, ఒకసారి తెలంగాణలో.

త్వరలో జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్ తరపున పోటీ చేయాలని వకుళాభరణం భావించారు. అయితే, రాజకీయ సమీకరణాల  కారణంగా ఆయనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన అధిష్ఠానం.. ఇచ్చిన హామీ మేరకు బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించింది. తనను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించడంపై వకుళాభరణం సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవమని, తనను గుర్తించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. బీసీలు సమున్నతంగా ఎదిగేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

More Telugu News