Kalyan Singh: బీజేపీ సీనియర్ నేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి  కల్యాణ్ సింగ్ కన్నుమూత

  • గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న కల్యాణ్ సింగ్
  • మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించిన యూపీ
  • గొప్ప రాజనీతిజ్ఞుడన్న ప్రధాని మోదీ
  • సంతాపం తెలిపిన పలువురు నేతలు
Kalyan Singh Former Uttar Pradesh Chief Minister Dies

గత కొన్ని వారాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. లక్నోలోని సంజయ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. కల్యాణ్ సింగ్ మృతికి సంతాపంగా యూపీ ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. కల్యాణ్ సింగ్ మృతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడని, మానవతావాది అని ప్రశంసించారు. భారత సంస్కృతి పునరుజ్జీవానికి ఆయన అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులు కల్యాణ్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. విద్యార్థి దశ నుంచే ఆరెస్సెస్‌తో అనుబంధం పెంచుకున్న కల్యాణ్‌సింగ్.. ఎమర్జెన్సీ సమయంలో 21 నెలలు జైలులో ఉన్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో యూపీ సీఎంగా ఆయనే ఉన్నారు. 2014-19 మధ్య రాజస్థాన్ గవర్నర్‌గానూ కల్యాణ్ సింగ్ పనిచేశారు.

More Telugu News