China: తాలిబన్లతో స్నేహంగా ఉంటాం: చైనా ప్రకటన

  • ఆప్ఘన్ తో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం
  • మాతో మంచి సంబంధాలు ఉండాలని తాలిబన్లు పలుమార్లు చెప్పారు
  • కాబూల్ లో మా ఎంబసీ తెరిచే ఉంటుంది
China announces that it strengthen ties with Afghanistan

ఆఫ్ఘనిస్థాన్ లో అధికారాన్ని చేజిక్కించుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తాలిబన్లకు చైనా శుభవార్త అందించింది. ఆప్ఘన్ తో స్నేహబంధం, సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చైనా అధికార ప్రతినిధి ఈరోజు ప్రకటించారు. అనధికారికంగా బంధాలను కొనసాగించేందుకు సిద్ధమని చెప్పారు.

ఆఫ్ఘనిస్థాన్ తో చైనాకు 76 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మరోవైపు పశ్చిమ చైనాలోని ఉయ్ గర్ ముస్లింలకు ఆఫ్ఘనిస్థాన్ ఆవాసాన్ని కల్పిస్తుందేమో అనే ఆందోళన చైనాలో ఎప్పటి నుంచో ఉంది. దీంతో, తాలిబన్లతో కూడా సత్సంబంధాలను నెలకొల్పుకునే యోచనలో డ్రాగన్ దేశం ఉంది.
 
చైనాతో మంచి సంబంధాలు ఉండాలనే విషయాన్ని తాలిబన్లు పలుమార్లు చెప్పారని చైనా అధికార ప్రతినిధి హువా చన్యింగ్ చెప్పారు. ఆప్ఘన్ పునర్నిర్మాణంలో చైనా భాగస్వామి కావాలని తాలిబన్లు కోరుకుంటున్నారని తెలిపారు. తమ దేశ భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆప్ఘన్ ప్రజలకు ఉంటుందని చెప్పారు. అధికార మార్పిడి ప్రక్రియను తాలిబన్లు ప్రశాంతంగా చేపడతారని భావిస్తున్నట్టు తెలిపారు. కాబూల్ లోని చైనా ఎంబసీ కొనసాగుతుందని చెప్పారు.

More Telugu News