Hyderabad: అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో బాంబు కలకలం.. పరుగులు పెట్టిన బాంబ్ స్క్వాడ్

  • అనుమానిత వస్తువు ఉన్నట్టు పోలీసులకు ఫోన్
  • చెత్తడబ్బాలో కనిపించిన పనిచేయని సెల్‌ఫోన్
  • ఊపిరి పీల్చుకున్న మెట్రో సిబ్బంది, ప్రయాణికులు
Bomb scare at Ameerpet metro station

హైదరాబాద్ అమీర్‌పేటలోని మెట్రో స్టేషన్‌లో నిన్న బాంబు కలకలం రేగింది. దీంతో బాంబ్‌స్క్వాడ్ ఉరుకులు పరుగులు పెట్టారు. చివరికి అనుమానిత వస్తువు బాంబు కాదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మెట్రో స్టేషన్‌లో ఆదిత్య ఎన్‌క్లేవ్‌వైపు ఉన్న చెత్త డబ్బాలో అనుమానిత వస్తువేదో ఉన్నట్టు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది.. దానిని బాంబుగా భావించి పోలీసు కంట్రోల్ రూముకు సమాచారం అందించారు.

వారి నుంచి సమాచారం అందుకున్న బాంబ్‌స్క్వాడ్, ఎస్సార్ నగర్ పోలీసులు క్షణాల్లోనే స్టేషన్‌కు చేరుకుని తనిఖీ చేశారు. చివరికి పోలీసు జాగిలం సాయంతో చెత్తడబ్బాలో గాలించగా సెల్‌ఫోన్ లభ్యమైంది. ఆ ఫోన్ పనిచేయకపోవడంతో దానిని చెత్తడబ్బాలో పడేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాంబు లేదని తెలియడంతో మెట్రో సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News