NASA: నీళ్లుండే చాన్సే లేదు.. అది మట్టి: అరుణ గ్రహంపై నాసా ఆసక్తికరమైన కామెంట్​

  • దక్షిణ ధ్రువం వద్ద నీళ్లున్నాయన్న ఇటలీ శాస్త్రవేత్తలు
  • రాడార్ సిగ్నళ్ల ద్వారా నిర్ధారణ
  • కాదని తేల్చిన నాసా జేపీఎల్
  • 44 వేల రాడార్ శబ్దాల విశ్లేషణ
NASA Interesting Comment On Mars

అంగారకుడి మీద జీవం గుట్టును తెలుసుకునేందుకు ఇప్పుడు పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా నీటి జాడను పసిగట్టేందుకు శాస్త్రవేత్తలు అనునిత్యం కృషి చేస్తున్నారు. నీళ్లున్నాయని ఎంతో కాలంగా చెబుతూ వస్తున్నారు. తాజాగా గత నెలలో అరుణ గ్రహం దక్షిణ ధ్రువం వద్ద కొన్ని కొలనులున్నట్టు గుర్తించారు. నీటి జాడలున్నాయని నిర్ధారించారు.

అయితే, అవి నీళ్లు కాదని తాజాగా నాసాలోని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు తేల్చారు. మార్స్ సబ్ సర్ఫేస్ లో (నేల నుంచి కొంచెం లోతులో) నీళ్లను గుర్తించినట్టు ఇటలీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్త 2018లో ప్రకటించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) మార్స్ ఎక్స్ ప్రెస్ ఆర్బిటర్ లోని రాడార్ గుర్తించిన ఆనవాళ్ల ప్రకారం అవి నీటి జాడలని పేర్కొన్నారు.

అయితే, తాజాగా వాటిని పరిశీలించిన నాసా జేపీఎల్ శాస్త్రవేత్తలు.. అవి మట్టి జాడలు అయిఉంటాయని తేల్చారు. అతి శీతలమైన ల్యాబ్ లో వారు పరిశోధన చేశారు. మార్స్ పై ఉన్న ఆ సరస్సులన్నీ అతి శీతలమైన ప్రాంతాల్లోనే ఉన్నాయని, కాబట్టి అక్కడ నీరు ద్రవరూపంలో ఉండే అవకాశమే లేదని నిర్ధారించారు.

ఆదిత్య ఆర్. ఖుల్లర్, జెఫ్రీ జె. ప్లాట్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దాదాపు 44 వేల రాడార్ శబ్దాలను విశ్లేషించారు. అంగారకుడి ఉపరితలానికి అతి సమీపంలో రాడార్లు పంపించిన సిగ్నళ్లు నీటికి సంబంధించినవి కాదని గుర్తించారు. అక్కడ నీరు గడ్డకట్టిన స్థితిలోనే ఉంటుందని, బహుశా రాడార్లు గుర్తించింది మట్టివేమోనని కంప్యూటర్ మోడల్స్ ద్వారా నిర్ధారించారు. ఎత్తైన కొండల నుంచి ఇసుక, గులక రాళ్లు కిందకు వచ్చి ఉంటాయని తేల్చారు. అయితే, రాడార్ సిగ్నళ్లు ఏంటన్నది ప్రస్తుతానికి కచ్చితంగా నిర్ధారించలేమని అంటున్నారు.

More Telugu News