Bandi Sanjay: ప్రజలు చీదరించుకుంటున్నా.. కేసీఆర్ కు సిగ్గు రావడం లేదు: బండి సంజయ్

KCR not ashamed even after people are hating him says Bandi Sanjay
షార్ట్స్‌లో చూడండి
హుజూరాబాద్ ఉపఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీచమైన పనులకు దిగజారుతున్నారని... చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి బతుకు ఎందుకో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఒక ఉపఎన్నికలో గెలవడానికి బలుపెక్కి, బరితెగించి, నీచాలకు దిగజారారని మండిపడ్డారు. కేసీఆర్ చేస్తున్న పనులకు ఆయనను ప్రజలు చీదరించుకుంటున్నారని... అయినా ముఖ్యమంత్రికి సిగ్గు రావడం లేదని అన్నారు.
 
బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి గారి పేరు మీద ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఫేక్ ఐడీలను తయారు చేశారని... తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. మధుసూదన్ రెడ్డి పేరు మీద వాళ్లే పోస్టులు చేస్తూ... మళ్లీ వాళ్లే ఆయన దిష్టి బొమ్మలను తగలబెడుతున్నారని అన్నారు. ఫేక్ ఐడీలు సృష్టించి, తప్పుడు ప్రచారం చేసే స్థాయికి నీవు దిగజారావంటే... నీ స్థాయి ఏమిటో ప్రజలకు అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

హుజూరాబాద్ లో కోట్లు ఖర్చు చేస్తున్నారని, కేసుల మీద కేసులు పెడుతున్నారని సంజయ్ అన్నారు. బీజేపీ జెండా కనిపిస్తే వణికిపోతున్నారని చెప్పారు. బీజేపీకి అనుకూలంగా రోజురోజుకూ సర్వే రిపోర్టులు పెరిగిపోతున్నాయని, దీంతో కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. మీ పాలనపై మీకు నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. కుట్ర రాజకీయాలకు పాల్పడితే, తాము కూడా అదే స్థాయిలో ఎదుర్కొంటామని హెచ్చరించారు.
 
బీజేపీ భయపడే పార్టీ కాదని అన్నారు. నువ్వు రాష్ట్రంలో ఉంటే... కేంద్రంలో మేమున్నామని సంజయ్ అన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా, తల్లకిందుల తపస్సు చేసినా నీవు గెలవలేవని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్ కొంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. నీ ఫేక్ పాలన, ఫేక్ ఆలోచనలు, ఫేక్ బంపర్ ఆఫర్లను ప్రజలు గుర్తించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.
Go Back to Shorts
Bandi Sanjay
Etela Rajender
BJP
KCR
TRS
Huzurabad

More Telugu News