Australia: చోరీకి గురైన అపురూప కళాఖండాలను భారత్​ కు తిరిగిచ్చేయనున్న ఆస్ట్రేలియా

  • వెల్లడించిన ఆ దేశ నేషనల్ ఆర్ట్ గ్యాలరీ
  • 14 కళాఖండాలు వెనక్కు
  • అందులో ఆరు చోరీకి గురైనవని వెల్లడి
  • న్యాయ సమస్యలపై మార్గదర్శకాలు
Australia to Return Stolen Artefacts To India

మన దేశానికి చెందిన అపురూప కళాఖండాలను ఆస్ట్రేలియా తిరిగిచ్చేయాలని నిర్ణయించింది. త్వరలోనే 14 కళాఖండాలను భారత్ కు అప్పగించేస్తామని ఆస్ట్రేలియా నేషనల్ గ్యాలరీ ఇవాళ ప్రకటించింది. అందులో ఆరు కళాఖండాలను దొంగిలించి ఉంటారని లేదా అక్రమ రవాణా చేసి ఉండొచ్చని గ్యాలరీ తెలిపింది.

మత, సాంస్కృతిక కళాఖండాలైన వాటి ధర సుమారు రూ.16.33 కోట్లు (22 లక్షల డాలర్లు) ఉంటుందని అంచనా. ఆ కళాఖండాలన్నీ కూడా 12వ శతాబ్దం నాటివని నిపుణులు చెబుతున్నారు. ఆ కళాఖండాలన్నింటినీ భారత్ కు తిరిగిచ్చేసి, తమ గ్యాలరీ చరిత్రలోనే ఇంతటి కఠిన కాలానికి పరిష్కారం చూపిస్తామని ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ నిక్ మిజెవిచ్ చెప్పారు.

దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కుల గురించి తెలుసుకునేందుకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఆసియా నుంచి వచ్చిన మరో మూడు విగ్రహాల గురించి కూడా ఆరా తీస్తున్నామన్నారు. ప్రపంచంలోని ఆర్ట్ గ్యాలరీలకు ఇదొక సమస్య అనీ, తాము కాలానుగుణంగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అన్నారు.


వీటిలో 13 కళాఖండాలను మాన్ హాటన్ లో విగ్రహాల డీలింగ్ చేసే సుభాష్ కపూర్ అనే స్మగ్లర్ విదేశాలకు అమ్మాడని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా దర్యాప్తు సంస్థ అతడిపై ‘ఆపరేషన్ హిడెన్ ఐడల్’ పేరిట దర్యాప్తు చేసింది. కోర్టులో విచారణ కూడా జరగనుంది. అయితే, ఆ కథనాలన్నింటినీ కపూర్ కొట్టిపారేశాడు. తమిళనాడులో చోళుల కాలం నాటి 11, 12వ శతాబ్దపు హిందూ దేవతల విగ్రహాలనే కపూర్ ఎక్కువగా అక్రమ రవాణా చేసేవాడని అధికారులు చెబుతుంటారు. 2011లో అతడిని అరెస్ట్ చేసిన తర్వాత అమెరికా వందలాది కళాఖండాలను తిరిగిచ్చింది.

కాగా, ఆస్ట్రేలియా నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఇప్పటికే దొంగిలించి విదేశాలకు అక్రమ రవాణా చేసిన నృత్య భంగిమలో ఉన్న శివుడి కాంస్య విగ్రహాన్ని తిరిగిచ్చేసింది. తమిళనాడులోని గుడి నుంచి చోరీకి గురైన ఆ విగ్రహం విలువ సుమారు రూ.37.13 కోట్లు (50 లక్షల డాలర్లు) ఉంటుందని అంచనా.

More Telugu News