Team India: భారత బ్యాట్స్‌మెన్ విఫలం.. రెండో టీ20 శ్రీలంకదే!

  • భారీ మార్పులతో బరిలోకి ఇండియా
  • పరుగులు పిండుకోవడంలో విఫలమైన బ్యాట్స్‌మెన్
  • 1-1తో సిరీస్ సమం
  • నిర్ణయాత్మక మూడో మ్యాచ్ నేడే
India lost 2nd t20 against sri lanka

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి జరిగిన రీ షెడ్యూల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో మ్యాచ్ నేడు జరగనుంది. నిజానికి ఈ మ్యాచ్ మొన్ననే జరగాల్సి ఉండగా టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో మ్యాచ్‌ను నిన్నటికి వాయిదా వేశారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. సమాధానంగా శ్రీలంక మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

లంక విజయంలో మినోద్ భానుక (36), ధనంజయ డి సిల్వా (40-నాటౌట్) ప్రధాన భూమిక పోషించారు. అవిష్క ఫెర్నాండో 11, హసరంగ 15, చమిక కరుణరత్నె 12 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగింది. ఓపెనర్ పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్ వెళ్లిపోవడం, కృనాల్ పాండ్యా కరోనాతో జట్టుకు దూరం కావడం, అతడితో సన్నిహితంగా మెలిగిన మరికొందరిని దూరం పెట్టడంతో జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియా, నితీశ్ రాణాలు ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేశారు.

ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ పరుగులు పిండుకోవడంలో తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. కొత్త కుర్రాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (21), దేవదత్ పడిక్కల్ (29) పర్వాలేదనిపించినా నితీశ్ రాణా (9) సంజు శాంసన్ (7) దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ ధావన్ 40 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో దనంజయ 2, చమీర, హసరంగ, దాసున్ శనక చెరో వికెట్ తీసుకున్నారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డి సిల్వను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.

More Telugu News