Nara Lokesh: జగన్ బంధువులు లేటరైట్ ముసుగులో బాక్సెట్ తవ్వకాలు చేపడుతున్నారు: నారా లోకేశ్ ఆరోపణ

  • విశాఖ మన్యం ఏరియాలో లేటరైట్ తవ్వకాలు
  • పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతలు
  • అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులు తమ నేతలను నిర్బంధించారన్న లోకేశ్
Nara Lokesh once again slams CM Jagan

విశాఖ మన్యం ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు నిర్బంధించారంటూ ఆ పార్టీ అగ్రనేత నారా లోకేశ్ వెల్లడించారు. పోలీసుల నిర్బంధంలో ఉన్న టీడీపీ నేతలతో ఫోన్ లో మాట్లాడానని తెలిపారు.

విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అభయారణ్యంలో జగన్ బంధువులు లేటరైట్ ముసుగులో బాక్సెట్ తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇది 15 వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం అని అన్నారు. బాక్సైట్ రెడ్డి తనకు దేవుడిచ్చిన అన్నయ్య గాలి జనార్దన్ రెడ్డిని మించిపోతున్నాడని విమర్శించారు. తన బంధువులైన వైవీ విక్రాంత్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలతో మైనింగ్ మాఫియా పనులు చేయిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.

వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేంతవరకు పోరాడాలని టీడీపీ నేతలకు సూచించానని లోకేశ్ వివరించారు. అభయారణ్యాన్ని ధ్వంసం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తూ, గిరిజనుల హక్కులపై ఉక్కుపాదం మోపుతూ చెలరేగిపోతున్న వైసీపీ మైనింగ్ మాఫియాను తరిమికొట్టేంత వరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

More Telugu News