Raghu Rama Krishna Raju: ఈ తీరు చూస్తుంటే 'మా చెల్లి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ' అనే డైలాగ్ గుర్తుకు వస్తోంది: జ‌గ‌న్‌కు ర‌ఘురామ లేఖ‌

  • పేద‌వారి ఇళ్ల‌కు శంకుస్థాప‌న‌లు ప‌దే ప‌దే చేస్తున్నారు
  • వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు
  • య‌మ‌లీల సినిమాలోని డైలాగు గుర్తు వ‌స్తోంది
  • ఇప్ప‌టికైనా పేద‌ల‌కు ఇళ్లు ఇవ్వాలి
raghu rama writes letter to jagan

ముఖ్యమంత్రి జగన్ కు ఎంపీ రఘురామకృష్ణ రాజు నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో వ‌రుస‌గా లేఖ‌లు రాసిన విష‌యం తెలిసిందే. ఈ కోవలో ఇప్పుడు నవ సూచనల పేరుతో కొత్త‌గా లేఖ‌లు రాయ‌డం ప్రారంభించారు. రాష్ట్రంలో 2023 నాటికి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఇళ్ల నాణ్యత నాసిరకంగా ఉన్నందున ఒకసారి వాటిని నిర్మించే ప్రదేశానికి వెళ్లి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జ‌గ‌న్‌ను కోరుతున్నానని ఆయ‌న పేర్కొన్నారు.

ఏపీలో 31 లక్షల కుటుంబాల కోసం 17,000 కాలనీలు నిర్మించాలని ప్ర‌ణాళిక‌లు వేశార‌ని అందులో ర‌ఘురామ‌ తెలిపారు. ముందుగా రూ.56,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్ర‌భుత్వం అనంత‌రం మాత్రం దాన్ని రూ.70,000 కోట్లకు పెంచింద‌ని చెప్పారు. మరికొన్ని గృహాలకు శంకుస్థాపన చేయబోతున్నామంటూ వర్చువల్ విధానంలోనే ఇప్పటికే నాలుగు సార్లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించార‌ని ఎద్దేవా చేశారు.

ప్ర‌భుత్వం ఇన్ని సార్లు శంకుస్థాపనలు చేయడం చూస్తుంటే యమలీల చిత్రంలోని 'మా చెల్లి పెళ్లి...జరగాలి మళ్లీ మళ్లీ' అనే డైలాగ్ గుర్తుకు వస్తోందని చుర‌క‌లంటించారు. రాష్ట్రంలో అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎందుకు పేదవారికి ఇవ్వడం లేదని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా ఇటువంటి చ‌ర్య‌లు మానుకోవాల‌ని ర‌ఘురామ కృష్ణ‌రాజు సూచించారు. పేద‌వారికి ఇళ్లు ఇచ్చే విష‌యంలో స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు.


 

More Telugu News