Love: ఫేస్​బుక్​ ప్రేమ.. బార్డర్​ దాటించింది.. కటకటాల్లోకి నెట్టింది!

  • మార్చి 8న బంగ్లాదేశ్ వెళ్లిన బెంగాల్ యువకుడు
  • అక్కడే ప్రేమించిన అమ్మాయితో పెళ్లి
  • ఈ నెల 25 దాకా వారింట్లోనే మకాం
  • భార్యతో వస్తూ సరిహద్దుల్లో దొరికిపోయిన జంట
  • పోలీసుల అదుపులో దంపతులు
Man Crossed Border For Bangladesi Lover Couple Arrested By BSF

పీకల్లోతు ప్రేమలో మునిగినవారికి హద్దులు, సరిహద్దులు తెలియవంటారు. కొందరు సాహసవీరులు సరిహద్దుల అవతల ఉన్న ప్రేయసి ప్రేమను దక్కించుకునేందుకు ఎంతటి సాహసానికైనా తెగిస్తున్నారు. కానీ, ఈ జంట విషయంలో మాత్రం ఆ సాహసం బెడిసికొట్టింది. ఫేస్ బుక్ లో మొదలైన ప్రేమ.. బార్డర్ దాటెళ్లి.. కటకటాలకు దారి తీసింది. ఇంతకీ ఏమైందంటే..

జైకాంతో చంద్ర రాయ్.. వయసు 24 ఏళ్లుంటాయి. ఉండేది పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లా బల్లవ్ పూర్. ఫేస్ బుక్ లో అలా అలా వేళ్లాడిస్తుంటే ఓ 18 ఏళ్ల అమ్మాయి పరిచయం అయింది. ఆమెది పొరుగు దేశం బంగ్లాదేశ్ లోని నెరైల్. వారిద్దరి పరిచయం రోజులు గడిచేకొద్దీ బలపడింది. ప్రేమ చిగురించి గాఢమైన బంధంగా మారింది. ఎలాగైనా పెళ్లి చేసుకుని కలిసి బతకాలనుకున్నారు. కానీ, దేశాలేమో వేరు. ఎలా పెళ్లి చేసుకునేది!

అందుకు జైకాంతో సరిహద్దులు దాటేద్దామని డిసైడ్ అయ్యాడు. తారక్ నగర్ కు చెందిన అప్పు అనే ఓ బ్రోకర్ సాయంతో మార్చి 8న బంగ్లాదేశ్ వెళ్లాడు. రెండ్రోజులకే అంటే మార్చి 10నే ప్రేయసిని అక్కడి సంప్రదాయం ప్రకారం మనువాడాడు. ఈనెల 25 దాకా అత్తగారింట్లోనే ఉన్నాడు. మరి, ఎప్పుడూ అక్కడే ఉండలేరు కదా.. భారత్ రావాల్సిందే కదా. ఇద్దరు కలిసి భారత్ వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈసారి అక్కడి బ్రోకర్ రాజుమండల్ కు 10 వేల టాకాలిచ్చి బార్డర్ దాటే ప్రయత్నం చేశారు.


అన్నిసార్లు అదృష్టం కలిసి రాదు కదా.. మధుపూర్ సరిహద్దుల వద్ద ఇద్దరు బార్డర్ దాటే ప్రయత్నం చేస్తున్నారంటూ సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) నిఘా వర్గం.. 82 బెటాలియన్స్ ట్రూప్స్ కు సమాచారమిచ్చింది. శనివారం సాయంత్రం 4.15 గంటలకు ఆ ఇద్దరినీ భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. విచారిస్తే అతగాడి వివరాలు సరిగ్గానే ఉన్నా.. అమ్మాయి మాత్రం నీళ్లు నమిలేసింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. ఇదిగో ఇలా వాళ్ల లవ్ స్టోరీని బయటపెట్టేశారు.

వారిని భీంపూర్ పోలీసులకు బీఎస్ఎఫ్ అధికారులు అప్పగించారు. అక్రమంగా సరిహద్దులు దాటినందుకు వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఈ వివరాలను 82 బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ సంజయ్ ప్రసాద్ సింగ్ ధ్రువీకరించారు. అబ్బాయే సరిహద్దులు దాటాడని చెప్పారు. సరిహద్దుల్లో మానవ అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడూ అప్రమత్తతతో ఉంటున్నామన్నారు. అక్కడి అమాయక అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారని చెప్పారు. వీరిద్దరి విషయంలో మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పారు. వారి ప్రేమలో నిజాయతీ ఉందన్నారు.

More Telugu News