Drone: జ‌మ్ములో మ‌రో క‌ల‌క‌లం.. మిల‌ట‌రీ ఏరియాలో తిరిగిన మరో 2 డ్రోన్లు.. హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించిన అధికారులు

  • రాత్నుచక్‌-కాలుచక్ మిలిట‌రీ ఏరియా వ‌ద్ద ఘ‌ట‌న‌
  • కాల్పులు జ‌రిపిన సైన్యం
  • వెన‌క్కి వెళ్లిపోయిన డ్రోన్లు
  • డ్రోన్లు తిరిగిన ప్రాంతంలో సెర్చ్ ఆప‌రేష‌న్ షురూ
drones spot in jammu

జమ్ము విమానాశ్రయంలోని వాయుసేన వైమానిక స్థావరంపై నిన్న తెల్ల‌వారు జామున‌ రెండు డ్రోన్లు పేలుడు పదార్థాల(ఐఈడీ)ను జారవిడవ‌డం క‌ల‌కలం రేపిన విష‌యం తెలిసిందే. దానివల్ల స్వ‌ల్పంగా న‌ష్టం జ‌రిగిన‌ప్ప‌టికీ, భారత సైనిక స్థావరంపై తొలిసారి డ్రోన్లతో దాడి జరగ‌డం భ‌విష్య‌త్తులో డ్రోన్లతో భారీ దాడులు జరిగే అవ‌కాశం ఉంద‌న‌డానికి సూచిక‌గా నిపుణులు అభిప్రాయప‌డుతున్నారు. ఈ దాడిని మ‌ర‌వ‌క‌ముందే జ‌మ్ములోని రాత్నుచక్‌-కాలుచక్ మిలిట‌రీ ఏరియా వ‌ద్ద ఈ రోజు తెల్ల‌వారు జామున రెండు డ్రోన్లు క‌ల‌క‌లం రేపాయి.

నిన్న జ‌రిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని భార‌త‌ సైన్యం వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై ఆ డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జ‌రిపిన‌ప్ప‌టికీ వాటిని కూల్చలేక‌పోయింది. అయితే, ఆ డ్రోన్లు వెంట‌నే తోక‌ముడిచి వెన‌క్కి వెళ్లిపోయాయి. ఆ డ్రోను తిరిగిన‌ ప్రాంతంలో ఏవైనా పేలుడు ప‌దార్థాలను జార విడిచిందా? అన్న విష‌యాన్ని తేల్చేందుకు సైన్యం సెర్చ్‌ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది.

ఇంతవరకు ఎటువంటి ఆధారాలు దొర‌క‌లేద‌ని అధికారులు చెప్పారు. ఆ ప్రాంతంలో హైఅలెర్ట్ ప్ర‌క‌టించిన‌ట్లు వివ‌రించారు. డ్రోన్ల దాడిని ఎదుర్కొనేందుకు భార‌త్ వ‌ద్ద శక్తిమంతమైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ లేదు. దీంతో పాక్ డ్రోన్ల సాయంతో ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుండ‌డం ప‌ట్ల భార‌త‌ సైన్యం అప్ర‌మ‌త్తమైంది. 2019 నుంచి పాక్ డ్రోన్ల ద్వారా జ‌మ్ములోని ఉగ్ర‌వాదుల‌కు ఆయుధాలు, డ్ర‌గ్స్ వంటివి స‌ర‌ఫ‌రా చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది.

More Telugu News