Modi: కశ్మీర్‌ లోయలో భద్రత కట్టుదిట్టం

  • జూన్‌ 24న ప్రధానితో కశ్మీర్‌ నేతల  భేటీ
  • అప్రమత్తమైన భద్రతా బలగాలు
  • ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దని నిర్ణయం
  • సరిహద్దుల్లోనూ హైఅలర్ట్‌
  • ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలి కీలక సమావేశం
Security tightened in kashmir valley ahead of PMs Meeting with JKs leaders

జూన్‌ 24న జమ్మూకశ్మీర్‌కు చెందిన 14 రాజకీయ పార్టీల తరఫున హాజరుకానున్న ప్రతినిధులతో ప్రధాని మోదీ సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.

ఈ మేరకు భద్రతా బలగాలకు చెందిన ఉన్నతాధికారులు నేడు శ్రీనగర్‌లో భేటీ అయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న భద్రతాపరమైన పరిస్థితులపై చర్చించారు. కొన్ని చోట్ల లోపాలు కనిపించాయని వాటిని వెంటనే కట్టుదిట్టం చేసేలా చర్యలు చేపట్టామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశం అత్యున్నతమైందని.. వీటిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా చూసేందుకు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని మరో అధికారి తెలిపారు. అలాగే జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగుతున్న కీలక రాజకీయ సమావేశం ఇదే కావడం విశేషం.

మరోవైపు నియంత్రణా రేఖ వెంట సైతం బలగాలు అప్రమత్తమయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రతికూల ఘటనలకు అవకాశం ఇవ్వొద్దని నిర్ణయించుకున్నామని అధికారులు తెలిపారు.

More Telugu News