Susheel Kumar Gaikwad: కరోనాతో చావు అంచుల వరకు వెళ్లిన హైదరాబాద్ బాడీ బిల్డర్.. సోనూసూద్ సాయంతో కోలుకున్న సుశీల్ కుమార్

Body builder scripts miraculous recovery from COVID
  • కరోనాతో ఏప్రిల్‌లో స్థానిక ఆసుపత్రిలో చేరిన సుశీల్ కుమార్
  • సోనూ సూద్ సాయంతో మే 19న యశోద ఆసుపత్రికి
  • అప్పటికే 80 శాతం ఇన్ఫెక్షన్‌కు గురైన ఊపిరితిత్తులు
  • ఎక్మో చికిత్స అవసరం లేకుండానే కోలుకున్న వైనం
కరోనాతో చావు అంచులకు చేరుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ బాడీబిల్డర్ ప్రముఖ నటుడు సోనూసూద్ సాయంతో ఆ మహమ్మారి నుంచి బయటపడి కోలుకుంటున్నాడు. నగరంలోని మల్కాజిగిరికి చెందిన సుశీల్ కుమార్ గైక్వాడ్ (32) బాడీబిల్డింగ్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఏప్రిల్ చివరిలో కరోనా బారినపడిన సుశీల్ కుమార్ చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న మరో ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావించినప్పటికీ బెడ్లు దొరక్కపోవడంతో ఆందోళన మొదలైంది.

దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే నటుడు సోనూసూద్ సాయం అర్థించారు. ఆయన వెంటనే స్పందించడంతో మే 19న సుశీల్ కుమార్ మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో చేరాడు. అప్పటికే అతడి ఊపిరితిత్తులు 80 శాతం ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్టు వైద్యులు గుర్తించారు. సుదీర్ఘ చికిత్స అనంతరం ఎక్మో చికిత్స అవసరం లేకుండానే సుశీల్ కోలుకున్నాడు. దీంతో తాజాగా సుశీల్ కుమార్‌ను డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. కొవిడ్ సోకకముందు 100 కిలోలకు పైగా ఉన్న సుశీల్ కుమార్ ప్రస్తుత బరువు 72 కిలోలకు తగ్గిపోయిందని చెప్పారు. కాబట్టి తాము యువకులమని, ఆరోగ్యంగా ఉన్నామని, కరోనా తమను ఏమీ చేయలేదన్న అపోహలు వీడాలని కోరారు.
Susheel Kumar Gaikwad
Body-Builder
Hyderabad
Telangana

More Telugu News