Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు నోటీసులపై లోక్ సభ స్పీకర్ కార్యాలయం స్పందన

  • జగన్, సీఐడీ అధికారులపై రఘురాజు సభాహక్కుల నోటీసులు
  • పూర్తి వివరాలను అందించాలంటూ కేంద్ర హోంశాఖకు స్పీకర్ కార్యాలయం నోటీసులు
  • 15 రోజుల్లోగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం
Lok Sabha speaker office responds on Raghu Rama Krishna Raju notices

తనను ఏపీ సీఐడీ అధికారులు శారీరకంగా హింసించారంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సభాహక్కుల నోటీసును ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ కు సంబంధించిన బెయిల్ ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినందుకే తనపై కేసులు నమోదు చేశారని ఆయన తన నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా తనపై థర్డ్ డిగ్రీని ప్రయోగించారని తెలిపారు. ఏపీ సీఎం, సీఐడీ ఏడీజీ, సీఐడీ ఎస్పీలపై ఈ నోటీసులు ఇచ్చారు. వీటిపై లోక్ సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది.

ఇదే అంశానికి సంబంధించి రఘురాజు కుమారుడు భరత్, టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడు కూడా స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను స్పీకర్ కార్యాలయం పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను అందించాలంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. 15 రోజుల్లోగా వివరాలను అందించాలని కేంద్ర హోంశాఖకు నోటీసులు పంపింది.

More Telugu News