అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: మాన్సాస్ వ్యవహారంపై చంద్రబాబు స్పందన
- మాన్సాస్ ట్రస్టు కేసులో హైకోర్టు సంచలన తీర్పు
- కోర్టు తీర్పు హర్షణీయమన్న చంద్రబాబు
- వేల మంది ఉద్యోగులకు అండగా నిలిచిందని వెల్లడి
- ట్రస్టును కాపాడుకున్నారంటూ అశోక్ కు అభినందనలు
అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదన్న విషయం తాజా తీర్పుతో వెల్లడైందని పేర్కొన్నారు. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి స్పష్టమైందని అన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలోని వేలాది భూముల్ని కొల్లగొట్టాలన్న జగన్ దుర్మార్గ ఆలోచనలకు అడ్డుకట్ట పడిందన్నారు. హైకోర్టు తీర్పుతో తుగ్లక్ ముఖ్యమంత్రికి చెంపపెట్టు అని అభివర్ణించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కోర్టులో ఇన్నిసార్లు తలదించుకున్నది లేదని చంద్రబాబు విమర్శించారు. ఇకనైనా ముందు వెనుకలు ఆలోచించకుండా జీవోలు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు. ట్రస్టును కాపాడుకున్నారంటూ అశోక్ గజపతిరాజుకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.