Union Govt: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్విట్టర్ పాఠాలు నేర్పుతోంది: కేంద్రం మండిపాటు

  • ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలు అమలు చేస్తోందని ఆరోపణ
  • ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘిస్తోందని వెల్లడి
  • న్యాయవ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోందని వ్యాఖ్యలు
Union govt slams Twitter

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ పై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రమాదం ఉందన్న ట్విట్టర్ వ్యాఖ్యలు అవాస్తవం అని కొట్టిపారేసింది. ట్విట్టర్ సంస్థవి బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలు అని ఆరోపించింది.

నిబంధనల గురించి తమకు పాఠాలు నేర్పేందుకు ట్విట్టర్ యత్నిస్తోందని విమర్శించింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికే ట్విట్టర్ పాఠాలే నేర్పుతోందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వ్యంగ్యం ప్రదర్శించింది. ట్విట్టర్ ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘిస్తోందని, భారత న్యాయవ్యవస్థను దెబ్బతీయాలని ట్విట్టర్ చూస్తోందని ఆరోపించింది.

ఇటీవల 'కాంగ్రెస్ టూల్ కిట్' అంటూ బీజేపీ నేత సంబిత్ పాత్రా ట్వీట్ చేయగా, దానిపై 'మానిప్యులేటెడ్ మీడియా' అంటూ ట్విట్టర్ స్టాంప్ వేసింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని ట్విట్టర్ కార్యాలయంపై పోలీసులు దాడులు చేశారు. అంతేకాదు, మూడ్నెల్ల కిందట కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాలపై ట్విట్టర్ స్పందించకపోవడం కూడా కేంద్రం ఆగ్రహానికి కారణం అని భావిస్తున్నారు. రైతుల నిరసనల సందర్భంగా కొన్ని వివాదాస్పద ట్వీట్లు తొలగించాలని కేంద్రం కోరగా, ట్విట్టర్ పట్టించుకోలేదు.

More Telugu News