mahanadu: 'మా తెలుగుతల్లికి..' గీతాలాపనతో టీడీపీ డిజిటల్ మ‌హానాడు కార్యక్రమం ప్రారంభం

  • క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హ‌ణ‌
  • సంతాప తీర్మానాన్ని ప్రవేశ‌పెట్టిన‌ గూడూరి ఎరిక్సన్ బాబు
  • వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ‌
mahanadu begins

'మా తెలుగుతల్లికి మల్లెపూదండ..' గీతాలాపనతో టీడీపీ మ‌హానాడు కార్యక్రమం ప్రారంభ‌మైంది. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో దీన్ని నిర్వ‌హిస్తున్నారు. ఏడాది కాలంలో మృతి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు మహానాడు సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాన్ని గూడూరి ఎరిక్సన్ బాబు ప్రవేశపెట్టారు.  

నేడు, రేపు జ‌రిగే డిజిటల్ మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ అధినేత‌ చంద్రబాబు త‌మ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీలో కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యం, రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, స్కాములు తదితర అంశాలపై తీర్మానం చేయనున్నారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్ర‌తి ఏడాది మహానాడును నిర్వ‌హిస్తార‌న్న విష‌యం తెలిసిందే. నేడు, రేపు జ‌రిగే మ‌హానాడులో దాదాపు పది వేల మంది వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేలా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ విభాగాలను అన్నిటినీ కలిపి మ‌హానాడును నిర్వహిస్తున్నారు.

మొత్తం పదిహేను తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందులో పది తీర్మానాలు ఆంధ్రప్రదేశ్ కు, ఐదు తీర్మానాలు తెలంగాణకు సంబంధించినవి. రాజకీయ తీర్మానాన్ని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు.

దానితో పాటు ప్ర‌ధానంగా వ్యవసాయ సంక్షోభం, రైతుల‌ సమస్యలు, సంక్షేమానికి కోతలు-మారని బలహీనవర్గాల తలరాతలు, ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరుద్యోగ సమస్య-పరిశ్రమల మూసివేత అంశాల‌పై కూడా ప్ర‌ధానంగా తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్టి మాట్లాడ‌తారు.

More Telugu News