Lockdown: పశ్చిమ బెంగాల్ లో లాక్ డౌన్... రేపటి నుంచి అమలు

  • బెంగాల్ లోనూ కరోనా విజృంభణ
  • గత 24 గంటల్లో 20 వేలకు పైగా కేసులు
  • రెండు వారాల పాటు లాక్ డౌన్
  • అత్యవసర సర్వీసులకే అనుమతి
Lock Down announced in West Bengal

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్ లోనూ లాక్ డౌన్ విధిస్తూ మమతా బెనర్జీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ లాక్ డౌన్ రేపటి నుంచి రెండు వారాల పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

లాక్ డౌన్ సమయంలో అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలు, కోల్ కతా మెట్రో సహా రవాణా సర్వీసులు కూడా నిలిచిపోతాయని వెల్లడించింది. కేవలం అత్యవసర సర్వీసులకే అనుమతి ఉంటుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బందోపాధ్యాయ్ పేర్కొన్నారు. నిత్యావసరాల దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతిస్తామని తెలిపారు.

ఆశ్చర్యకరంగా మిఠాయి అమ్మకందార్లను మాత్రం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతించారు. పెట్రోల్ పంపులకు ఇదే తరహా అనుమతులు వర్తిస్తాయని నోటిఫికేషన్ లో వివరించారు. బ్యాంకులు మాత్రం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యకలాపాలు సాగిస్తాయని పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో బెంగాల్ లో 20,846 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 136 మంది మరణించారు.

More Telugu News