Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు నివాసం వద్ద హైడ్రామా... అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ అధికారులు

  • రఘురామ వర్సెస్ ఏపీ సర్కారు
  • సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్న రెబల్ ఎంపీ
  • కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ
  • రఘురామ నివాసంలో గంటపాటు వాగ్యుద్ధం
AP CID Police arrests Raghurama Krishna Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ ఆయనపై వైసీపీ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. నేడు హైదరాబాదులోని రఘురామకృష్ణరాజు నివాసానికి ఏపీసీఐడీ అధికారులు వెళ్లారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అరెస్ట్ చేశారు.

అయితే, రఘురామకృష్ణరాజుకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్ ను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని రఘురామను కవర్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ అధికారులకు, రఘురామకు మధ్య గంటపాటు తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. అనంతరం ఏపీ సీఐడీ అధికారులు ఆయనను తమ వెంట జీపులో తీసుకెళ్లారు. కాగా రఘురామకృష్ణరాజుపై 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ రఘురామకృష్ణరాజు పుట్టినరోజు! 

More Telugu News