Time: టైమ్‌ అత్యంత ప్రభావవంతమైన సంస్థల జాబితాలో జియో, బైజూస్‌!

  • తొలిసారి ఈ తరహా జాబితా ప్రకటించిన టైమ్‌
  • 100 ప్రతిష్ఠాత్మక కంపెనీలకు చోటు
  • భారత్‌ నుంచి రెండు సంస్థలకు స్థానం
  • జియో తక్కువ ధరకు ఇంటర్నెట్‌ అందిస్తోందని ప్రశంస
  • కరోనా సమయంలో బైజూస్ ప్రభావం చూపిందని వ్యాఖ్య
TIMEs 100 most influential companies List has JIO And Byjus In it

టైమ్‌ మ్యాగజైన్‌ తొలిసారి ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన సంస్థల జాబితాలో భారత్‌కు చెందిన రెండు కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. అపర కుబేరుడు ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్‌ఫామ్స్‌ సహా ఆన్‌లైన్‌ విద్యాసేవల సంస్థ బైజూస్‌ టైమ్‌ ఎంపిక చేసిన సంస్థల జాబితాలో ఉన్నాయి.

ఆరోగ్య సంరక్షణ, వినోదం, సాంకేతికత, రవాణా సహా పలు రంగాల నుంచి టైమ్‌ నామినేషన్లను ఆహ్వానించింది. గత కొన్నేళ్లలో అతిపెద్ద 4జీ నెట్‌వర్క్‌ను స్థాపించిన జియో.. ప్రపంచంలోనే అతితక్కువ ధరకు ఇంటర్నెట్‌ అందిస్తోందని  టైమ్‌ ప్రశంసించింది. 410 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు గల ఈ సంస్థ గత ఏడాది 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను రాబట్టిందని గుర్తుచేసింది.  

ఇక బైజు రవీంద్రన్‌ స్థాపించిన బైజూస్‌ యాప్‌కు కరోనా టైంలో డిమాండ్‌ పుంజుకుందని టైమ్‌ తెలిపింది. మహమ్మారి సంక్షోభ సమయంలో యూజర్ల సంఖ్య రెట్టింపయ్యిందని పేర్కొంది. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌, ఇండోనేసియా, మెక్సికో, బ్రెజిల్‌ వంటి దేశాలకూ బైజూస్‌ విస్తరించిందని గుర్తుచేసింది.  

ఈ జాబితాలో టెస్లా, జూమ్‌, అడిడాస్‌, ఐకియా, మోడెర్నా, నెట్‌ఫ్లిక్స్‌ వంటి సంస్థలు కూడా స్థానం సంపాదించాయి.

More Telugu News