TRS: 'మనసు గర్వంతో నిండిపోతుంది'.. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా టీఆర్ఎస్ నేత‌ల స్పంద‌న‌

  • ఉద్యమం దావానలమై లక్ష్యాన్ని ముద్దాడాం
  • జన్మధన్యమైన సంతృప్తి: హ‌రీశ్ రావు
  • తెలంగాణ ప్రజలకు నేడు మరువలేని దినం: కేకే
  • పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: త‌ల‌సాని
trs leader on party formation day

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌జ‌లకు ఆ పార్టీ నేత‌లు శుభాకాంక్షలు తెలిపారు. త‌మ పార్టీ వ‌ల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్య‌మైంద‌ని చెప్పారు. 'ఉద్యమం నిప్పురవ్వగా మొదలైన రోజులు తలుచుకుంటే మనసు గర్వంతో నిండిపోతుంది. ఉద్యమం దావానలమై లక్ష్యాన్ని ముద్దాడినప్పుడు జన్మధన్యమైన సంతృప్తి. 20 ఏళ్లుగా కేసీఆర్ గారి బాటలో నడుస్తున్న సైనికుడికి ఇదొక జీవిత కాల సాఫల్యం' అని హ‌రీశ్ రావు ట్వీట్ చేశారు.

'ఒక సాహసం చరిత్ర గతిని మార్చింది. ఒక త్యాగం మరో చరిత్రను సృష్టించింది. కేసీఆర్ ఉక్కు సంకల్పం 60 ఏండ్ల కలను సాకారం చేసింది' అని హ‌రీశ్ రావు పేర్కొన్నారు.
 
తెలంగాణ ప్రజలకు నేడు మరువలేని దినమని కే కేశవరావు అన్నారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర‌ సాధన కోసం కన్న కలలను సాకారం చేసిన ఘనత కేసీఆర్‌ది అని ఆయ‌న చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ కల సాకారమైందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనతో పని పూర్తి కాలేదని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దడమే కల అని తెలిపారు.
 
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలకు, కార్యకర్తలకు, పార్టీని ఆదరిస్తున్న ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాన‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ట్వీట్ చేశారు.

తెలంగాణ అభివృద్ధి కోసం ప‌నిచేస్తోన్న టీఆర్ఎస్ శ్రేణుల‌కు సెల్యూట్ చేస్తున్నాన‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు.

More Telugu News