Thailand: మాస్క్ ధరించని థాయ్‌లాండ్ ప్రధాని.. భారీ జరిమానా

  • అధికారులతో సమావేశం సందర్భంగా మాస్క్ ధరించని ప్రధాని
  • అధికారులకు ఫిర్యాదు చేసిన బ్యాంకాక్ గవర్నర్
  • రూ. 14,270 జరిమానా
Thailand PM fined for not wearing face mask

మాస్క్ ధరించని థాయ్‌లాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అధికారులు 6వేల బాట్‌లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 14,270) జరిమానా విధించారు. అధికారులతో సమావేశం సందర్భంగా ప్రధాని మాస్క్ ధరించనందుకు గాను ఈ జరిమానా విధించారు. వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించి ప్రధాని ప్రయూత్ నిన్న సలహాదారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాస్క్ ధరించలేదు. గమనించిన బ్యాంకాక్ గవర్నర్ అశ్విన్ క్వాన్ ముయాంగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రధానిపై తాను ఫిర్యాదు చేసినట్టు గవర్నర్ తన ఫేస్‌‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ప్రధాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో అధికారులు ఆయనకు జరిమానా విధించారు.

దేశంలో కరోనా వైరస్ కొత్త వేవ్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి ప్రయాణికుల రాకపోకలపై థాయ్ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే,  థాయ్ పౌరులను మాత్రం మినహాయించింది. మరోవైపు, దేశంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. బ్యాంకాక్‌లో ఇంటి నుంచి బయటకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. లేకుంటే 20 వేల బాట్ల (రూ. 47,610) జరిమానా విధిస్తారు.

More Telugu News