Sharmila: ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల తీవ్ర వ్యాఖ్య‌లు.. నిరాహార దీక్ష 72 గంట‌లు కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం

  • ఉద్యోగాల కోసం చంద‌మామ‌లాంటి పిల్ల‌లు చ‌నిపోతున్నారు
  • దున్న‌పోతు మీద వాన ప‌డిన‌ట్లు కేసీఆర్ గారిలో మాత్రం చ‌ల‌నం లేదు
  • ఇంట్లో గ‌డియ వేసుకుని నిద్ర‌పోతున్నారా?
  • అస‌లు కేసీఆర్ చాతిలో ఉన్న‌ది గుండెనా?  లేక బండ‌రాయా?
sharmila slams kcr

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ యువ‌త‌కు ఉద్యోగాల కోసం ఆమె నిరాహార దీక్షకు దిగిన విష‌యం తెలిసిందే. పోలీసులు ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ ఆమె 72 గంట‌ల నిరాహార దీక్ష‌ను కొన‌సాగిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

దీక్ష‌ సంద‌ర్భంగా ఆమె ప్రసంగిస్తూ... 'ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో ముందుండి పోరాటం చేసిన వారు విద్యార్థులు.. అలాంటిది ఈ రోజు వారు ఉద్యోగాలు లేక ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నారు. ఉద్యోగాల‌ నోటిఫికేష‌న్  కోసం ఎదురుచూస్తున్నారు. చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు' అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

'మొన్న సునీల్ నాయ‌క్ అనే యువ‌కుడు కాక‌తీయ యూనివ‌ర్సిటీలోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌న చావు త‌ర్వాత‌యినా నోటిఫికేష‌న్లు రావాల‌ని చెప్పాడు. త‌న త‌ల్లిదండ్రుల‌కు భారమ‌వుతున్నాన‌ని సిరిసిల్ల‌లో మ‌హేంద‌ర్ యాద‌వ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. న‌ల్ల‌గొండ‌లో సంప‌త్ కుమార్ త‌న‌కు ఉద్యోగం వస్తుంద‌న్న ఆశ పోయింద‌ని ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు' అంటూ చెప్పుకొచ్చారు ష‌ర్మిల.

'ఇలా ఒక్కొక్క‌రి గురించి చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. ఇంత జ‌రుగుతున్నప్ప‌టికీ దున్న‌పోతు మీద వాన ప‌డిన‌ట్లు కేసీఆర్ గారిలో మాత్రం చ‌ల‌నం లేదు. కేసీఆర్ గారు ఉద్యమం నాడు అన్న‌మాట ఏంటీ? చ‌ంద‌మామ లాంటి మ‌న పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని అన్నారు. మ‌రి ఇప్పుడు చంద‌మామ లాంటి పిల్ల‌లు చ‌నిపోతుంటే కేసీఆర్ గారికి క‌నిపించ‌డం లేదా? ఇంట్లో గ‌డియ వేసుకుని నిద్ర‌పోతున్నారా?' అని ష‌ర్మిల ప్రశ్నించారు.

'అస‌లు కేసీఆర్ చాతిలో ఉన్న‌ది గుండెనా?  లేక బండ‌రాయా? ల‌క్షా 91 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉంది. ఎందుకు భ‌ర్తీ చేయ‌ట్లేదు? కేసీఆర్ గారు స‌మాధానం చెప్పాలి. ఏ ఇత‌ర పార్టీ పోరాటం చేసినా చేయ‌క‌పోయినా.. యువ‌తకు మ‌ద్దతుగా మేము నిల‌బ‌డ‌తాం' అని ష‌ర్మిల భరోసా ఇచ్చారు.

'వందల మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే అందుకు బాధ్యులు ఎవ‌రు? కేసీఆర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. ఉద్యోగాలు భ‌ర్తీ చేయాలి. నేను 72 గంట‌లు నిరాహార దీక్ష చేస్తాను. నాలుగో రోజు నుంచి జిల్లాల్లోనే మా నాయ‌కులు దీక్ష‌లు చేస్తుంటారు. ఉద్యోగాలు భ‌ర్తీ చేసేంతవ‌ర‌కు మా పోరాటం కొన‌సాగుతూనే ఉంటుంది. ప్ర‌భుత్వం నిద్ర‌లేవాలి' అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

More Telugu News