Vijayasai Reddy: పచ్చ పార్టీకి కొత్త నాయకత్వం వచ్చేది ఎప్పుడు బుచ్చన్నా?: విజయసాయిరెడ్డి

  • తండ్రీకొడుకుల ధృతరాష్ట్ర కౌగిలి నుంచి ఆ పార్టీ బయట పడేదెప్పుడు?
  • టీడీపీ త్వరలోనే చీలికలు, పీలికలు అవుతుంది
  • ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి చంద్రబాబు సమాధి కట్టారు
When did yellow party gets new leadership asks Vijayasai Reddy

తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. తండ్రీకొడుకుల ధృతరాష్ట్ర కౌగిలి నుంచి ఆ పార్టీ బయట పడేదెప్పుడని ఆయన ఎద్దేవా చేశారు. పచ్చ పార్టీకి కొత్త నాయకత్వం వచ్చేది ఎప్పుడు బుచ్చన్నా? అని ప్రశ్నించారు. త్వరలోనే చీలికలు, పీలికలు అయి ఎవరి ముక్క వాళ్లు లాక్కెళ్తారని సూటిగా చెప్పొచ్చుగా అని అన్నారు.

కొత్త నాయకులు రావడానికి టీడీపీలో ఏం మిగిలిందని ఎద్దేవా చేశారు. టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే... చంద్రబాబు సమాధి చేశారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో కీలక పాత్ర పోషించాలంటూ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

జూలై 8న వైయస్సార్ జయంతి నాడు ముఖ్యమంత్రి జగన్ కొత్త కార్యక్రమానికి నాంది పలుకుతున్నారని విజయసాయి అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వం... ఇప్పుడు ఆ పల్లెల పరిశుభ్రతకు సంకల్పించిందని చెప్పారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో పరిశుభ్రతకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు.

More Telugu News