Anand Swaroop Shukla: దేశంలో బురఖాలను నిషేధించాలంటున్న యూపీ మంత్రి

  • మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆనంద్ స్వరూప్ శుక్లా
  • బురఖాలు ధరించడం దుష్ట ఆచారమని కామెంట్ 
  • అమానవీయం అంటూ వ్యాఖ్యలు
  • అనేక దేశాలు బురఖాను నిషేధించాయని వివరణ
Uttar pradesh minister Anand Swaroop Shukla wants ban on Burkhas

ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా బురఖాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళలు బురఖాలు ధరించడం దుష్ట ఆచారమని, అమానవీయమని పేర్కొన్నారు. మహిళలు బురఖాలు ధరించకుండా నిషేధం విధించాలని అన్నారు. ఇప్పటికే పలు ముస్లిం దేశాలు బురఖాలను నిషేధించాయని వెల్లడించారు. ట్రిపుల్ తలాఖ్ ను ఎలా రూపుమాపామో, ఈ దురాచారంపైనా దేశంలో నిషేధాజ్ఞలు విధించాలని తెలిపారు.

మంత్రి శుక్లా ఇటీవలే మసీదుల్లో మైకులు, లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు విధించాలని బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ కు లేఖ రాసి వార్తల్లోకెక్కారు. రోజుకు ఐదు సార్లు నమాజ్ ను మైకులో వినిపిస్తుంటారని, ఇక ఇతర సందేశాలు, విరాళాలకు సంబంధించిన విజ్ఞప్తులు రోజంతా వినిపిస్తూనే ఉంటారని ఆరోపించారు. యోగా, ధ్యానం, ప్రార్థనలు, ఇంకేవైనా అధికారిక కార్యక్రమాలు చేసేవారికి ఇవి ఆటంకం కలిగిస్తుంటాయని వివరించారు.

More Telugu News