mukesh Ambani: 'ముఖేష్... ఇది కేవలం ట్రయిలరే'... లేఖలో అంబానీకి బెదిరింపులు!

  • అంబానీ ఇంటి సమీపంలో స్కార్పియోలో పేలుడు పదార్థాలు
  • తదుపరి మీ వద్దకు చేరుకుంటాయని బెదిరింపు లేఖ
  • దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక టీమ్ లు
Threat Letter Recovered by Police near Mukesh Ambani House

ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ నివాసమైన 'అంటీలియా' సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం లభించడం తీవ్ర కలకలం రేపగా, తాజాగా అదే వాహనంలో ఓ బెదిరింపు లేఖను అధికారులు కనుగొన్నారు. డ్రైవర్ పక్కనే ఉండే సీటులో ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు వాడేటటువంటి బ్యాగ్ ఉండగా దానిలో ఈ లేఖ బయటపడింది. ఇందులో ముఖేష్ తో పాటు నీతా అంబానీని సైతం ఆగంతుకులు బెదిరించారు.

అంబానీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రాసిన ఈ లేఖలో "నీతా అంబానీ, ముఖేష్‌ భయ్యాకు ఇదొక ఝలక్. మరోసారి ఈ పేలుడు పదార్థాలు మీ దగ్గరికి చేరుకుంటాయి. ఇది ట్రయిలర్ మాత్రమే" అని రాసుందని పోలీసు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.

కాగా, ముఖేష్ ఇంటి బయట ఆగివున్న ఓ స్కార్పియోపై అనుమానంతో సోదాలు చేయగా, పేలుడు పదార్థాలు లభించిన సంగతి తెలిసిందే. ముఖేష్ కుటుంబం వాడే సెక్యూరిటీ వాహనం నంబర్ ఈ స్కార్పియోకు ఉంది. దీంతో ఈ వాహనాన్ని ఎక్కడో దొంగిలించి తెచ్చుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వాహనంలో వచ్చిన వ్యక్తి మరో వాహనంలో వెళ్లిపోయాడని ఇప్పటికే గుర్తించిన ముంబై పోలీసులు, ఈ కేసును సీరియస్ గా తీసుకుని ఆగంతుకులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

More Telugu News