Narendra Modi: దేశాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు నాలుగు అంశాలపై దృష్టి సారించాం: ప్రధాని మోదీ

  • కేంద్ర బడ్జెట్ లోని అంశాలపై వెబినార్
  • ప్రసంగించిన ప్రధాని మోదీ
  • ప్రజారోగ్యంపై చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని వెల్లడి
  • మారుమూల గ్రామాల్లోనూ ఆరోగ్య సదుపాయాలు
PM Modi speech at a Webinor

కేంద్ర బడ్జెట్ ప్రకటనలపై నిర్వహించిన వెబినార్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యరంగంపై మాట్లాడుతూ, భారత్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు తమ ప్రభుత్వం ప్రధానంగా 4 అంశాలపై దృష్టి సారించిందని చెప్పారు.

రోగాలను నియంత్రించడం, ఆరోగ్య సంక్షేమాన్ని ప్రోత్సహించడం, ఆరోగ్య వసతులు మెరుగుపరిచి అందరికీ అందుబాటులో ఉంచడం, ఆరోగ్య నిపుణుల సంఖ్యను పెంచడమే కాకుండా నాణ్యతను పెంపొందించే చర్యలపై కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.  

ఆరోగ్య రంగంలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులకే పరిమితం కాకుండా, మారుమూల గ్రామాల్లోనూ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూస్తోందని వివరించారు. ఆరోగ్య రంగంలో పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు.  కరోనా గురించి చెబుతూ, భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉండాలని కరోనా సంక్షోభం గుణపాఠం నేర్పిందని తెలిపారు.

ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి 137 శాతం మేర కేటాయింపులు పెంచడం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కోసం రూ.35 వేల కోట్లు ప్రకటించారు. పీఎం ఆత్మనిర్భర్ స్వాస్థ్ భారత్ యోజన కింద ఆరేళ్ల కాలవ్యవధికి గాను రూ.64,180 కోట్లు కేటాయించారు. ఓవరాల్ కేటాయింపుల్లో కుటుంబ సంక్షేమ శాఖకు రూ.71,268 కోట్లు దక్కనున్నాయి.

More Telugu News