Team India: ముగిసిన మూడో రోజు ఆట... చెన్నై టెస్టు చేజింగ్ లో ఇంగ్లండ్ విలవిల

  • ఇంగ్లండ్ ముందు 482 పరుగుల భారీ టార్గెట్
  • 53 పరుగులకే 3 వికెట్లు డౌన్
  • అక్షర్ కు రెండు, అశ్విన్ కు ఓ వికెట్
  • ఇంకా 429 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఇంగ్లండ్
  • హైలైట్ గా నిలిచిన అశ్విన్ సెంచరీ
  • క్లిష్టమైన పిచ్ పై అద్భుతంగా ఆడిన అశ్విన్
England in troubles after losing three early wickets in Chennai test chasing

చెన్నై టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ లక్ష్యఛేదనలో కష్టాల్లో పడింది. 482 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ ఇవాళ ఆట చివరికి 53 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 429 పరుగులు చేయాలి. ఆటకు ఇంకా రెండ్రోజులు మిగిలున్నా గానీ... పిచ్ పరిస్థితి దృష్ట్యా అది అసాధ్యంగానే భావించాలి!

అంతకుముందు భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 286 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కు ఉపక్రమించింది. సెంచరీ హీరో అశ్విన్ ఓ వికెట్ తీయగా, తొలి టెస్టు ఆడుతున్న అక్షర్ పటేల్ రెండు వికెట్లతో ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు. 3 పరుగులు చేసి ఓపెనర్ డొమినిక్ సిబ్లీ అక్షర్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత ఊపుమీదున్న మరో ఓపెనర్ రోరీ బర్న్స్ (25)ను అశ్విన్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్లోనే నైట్ వాచ్ మన్ జాక్ లీచ్ ను అక్షర్ పటేల్ డకౌట్ చేయడంతో ఇంగ్లండ్ మూడో వికెట్ చేజార్చుకుంది.

నేటి ఆటలో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ (106) వీరోచిత సెంచరీ సాధించడం తెలిసిందే. పిచ్ మరీ నాసిరకంగా ఉందన్న ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లకు అశ్విన్ తన సెంచరీతో సమాధానం చెప్పినట్టయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 329 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టు 134 పరుగులకే ఆలౌటైంది.

More Telugu News