APSRTC: తిరుమల దర్శనం... ఏపీఎస్ ఆర్టీసీ... ఫుల్ డిమాండ్!

  • ఆర్టీసీ బస్సులో వెళితే సత్వర దర్శనం
  • రోజుకు 1000 టికెట్ల కేటాయింపు
  • మరింతగా పెంచాలంటున్న ఆర్టీసీ
  • బస్సుల్లో పెరిగిన ఆక్యుపెన్సీ
Full Demand for APSRTC Tirupati Buses

ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు ఎటువంటి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ఎంచుకునే స్లాట్ లో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లే అవకాశాన్ని కల్పించిన తరువాత, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రోజుకు 1000 శీఘ్రదర్శనం టికెట్లను ఆర్టీసీ ప్రయాణికులకు కేటాయించగా, అన్ని టికెట్లూ అమ్ముడైపోతున్నాయి. దీంతో మరిన్ని టికెట్లను కేటాయించాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. తద్వారా పడిపోయిన ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకోవాలని భావిస్తున్నారు.

కాగా, వెంకన్న దర్శనంతో ఆర్టీసీకి కోటాను ఇవ్వాలని గతంలో టీటీడీ ఈఓను ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ కోరగా, వెంటనే రోజుకు రెండు స్లాట్లలో 1000 టికెట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో స్వామివారి వారి భక్తులు ఎటువంటి సిఫార్సులు లేకుండా సులువుగా, తక్కువ సమయంలో దర్శన భాగ్యాన్ని పొందే అవకాశం లభించింది. దూర ప్రాంతాల నుంచి తిరుపతికి ఏపీఎస్ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే వారు, అదే సమయంలో స్వామి దర్శనం నిమిత్తం కూడా రూ. 300 చెల్లించి టికెట్ ను బుక్ చేసుకోవచ్చు.

దీంతో తిరుపతికి ప్రైవేటు బస్సుల్లో వెళ్లాలని భావించే వారు కూడా ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. టికెట్లకు ఎనలేని డిమాండ్ వచ్చింది. తిరుపతి మీదుగా తిరుమల చేరుకునే యాత్రికులకు సత్వర దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. గత నాలుగు రోజులుగా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. టికెట్లు విడుదల చేసిన అన్ని రోజులకూ బుకింగ్స్ పూర్తయ్యాయి. దీంతో ఆర్టీసీ కోటాను మరింతగా పెంచాలని అధికారులు కోరుతున్నారు.

More Telugu News