Kakani Govardhan Reddy: మంత్రులు ఎస్ఈసీపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు... ఆ ఫిర్యాదుపై మేం విచారణ జరుపుతాం: కాకాని గోవర్ధన్ రెడ్డి

  • ఎస్ఈసీపై స్పీకర్ కు  బొత్స, పెద్దిరెడ్డి ఫిర్యాదు
  • ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేసిన స్పీకర్
  • ఎస్ఈసీపై విచారణ జరిపే హక్కు తమకుందున్న ప్రివిలేజ్ కమిటీ
  • త్వరలోనే నేరుగా సమావేశం ఉంటుందన్న కమిటీ చైర్మన్ కాకాని
Kakani Govardhan Reddy responds over ministers complaint on SEC

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రులు స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఫిర్యాదు చేశారని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేశారని, స్పీకర్ ఆ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేశారని తెలిపారు. ఆ ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ ఇవాళ వర్చువల్ సమావేశం నిర్వహించిందని కాకాని తెలిపారు.

త్వరలోనే నేరుగా సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సభ్యులతో చర్చిస్తామని వివరించారు. ఈ అంశం ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి వస్తుందని నిర్ధారించుకున్నామని, అందుకే ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించామని అన్నారు. గతంలో ఇలాంటి అంశాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా పరిశీలించామని కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలాంటి విచారణే జరిగిందని, ఎస్ఈసీపై విచారణ జరిపే హక్కు ప్రివిలేజ్ కమిటీకి ఉందని స్పష్టం చేశారు.

More Telugu News