Nara Lokesh: అవినీతి పాలనను ఎండగడుతున్నారని పట్టాభిని లక్ష్యంగా చేసుకుని జగన్ రెడ్డే దాడులు చేయిస్తున్నారు: నారా లోకేశ్

  • టీడీపీ నేత పట్టాభిరామ్ పై దాడి
  • వైసీపీ గూండాలే దాడి చేశారన్న లోకేశ్
  • మంత్రులే చంపుతాం అని బెదిరిస్తున్నారని ఆరోపణ
  • పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెల్లడి
Lokesh responds over the attack on Pattabhiram

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై వైసీపీ గూండాలు దాడి చేశారంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఆధారాలతో సహా జగన్ అవినీతి పాలనను ఎండగడుతున్నారన్న కక్షతోనే పట్టాభిని లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడించారు. పట్టాభిపై కక్షతో జగన్ రెడ్డే ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

మంత్రులే చంపుతాం, ఇంటికొచ్చి కొడతాం అని బెదిరించడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి వైసీపీ మంత్రులే వార్నింగ్ ఇచ్చి మరీ గూండాలతో దాడి చేయించారంటే ఎంతగా బరి తెగించారో అర్థమవుతోందని వివరించారు. మీ బెదిరింపులకు అదిరిపోయేది లేదు, మీ దాడులకు బెదిరిపోయేది లేదు... మీ అరాచకపాలనను అంతమొందించి తీరుతామని లోకేశ్ స్పష్టం చేశారు.

More Telugu News