Srinivasareddy: తూర్పుగోదావరి జిల్లాలో.. పొలంలో శవమై తేలిన సర్పంచి అభ్యర్థి భర్త

  • సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేసిన పుష్పవతి
  • భర్త శ్రీనివాసరెడ్డిని కిడ్నాప్ చేసిన దుండగులు
  • అనంతరం అటవీప్రాంతంలో వదిలిపెట్టిన నిందితులు 
  • ఈ రోజు చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించిన వైనం 
Husband of Sarpanch candidate died in East Godavari

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట సర్పంచి అభ్యర్థి పుష్పవతి భర్త సబ్బెళ్ల శ్రీనివాసరెడ్డి పొలంలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపింది. పుష్పవతి నిన్న సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

 అదే సమయంలో ఆమె భర్త శ్రీనివాసరెడ్డిని కొందరు దుండగులు అపహరించి కాసేపటి తర్వాత అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. చేతులు, కాళ్లు కట్టేసి ఉండడంతో కొందరు గొర్రెల కాపరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయమై శ్రీనివాసరెడ్డిని పోలీసులు ఇవాళ మరోసారి విచారించారు. అయితే ఆ తర్వాత అనూహ్యరీతిలో శ్రీనివాసరెడ్డి పొలంలో శవమై తేలాడు. చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు.

శ్రీనివాసరెడ్డి టీడీపీ మద్దతుదారుడని భావిస్తున్నారు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, దీనిపై సమాచారం అందుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘటన స్థలానికి వెళ్లారు. పోలీసులు విచారణ జరిపి, వాస్తవాలు వెలికి తీయాలని కోరారు.

More Telugu News