Ramateertham: రామతీర్థం కొండ దిగిన సీతాలక్ష్మణ సమేత శ్రీరాముచంద్రుడు.. ప్రధానాలయంలోకి విగ్రహాల తరలింపు!

Ramateertham Idols Moved from Hill
షార్ట్స్‌లో చూడండి
గత నెల 28వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం, రామతీర్థంలోని నీలాచలం కొండపై ఉన్న శ్రీరామచంద్రుని విగ్రహానికి అపచారం చేయగా, అక్కడి విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త హోమాలు, పటిష్ఠమైన పోలీసు బందోబస్తు మధ్య, సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని విగ్రహాలతో పాటు, హనుమంతుని విగ్రహాన్ని ఆలయం నుంచి తొలగించి, దిగువన ఉన్న ప్రధానాలయంలోకి తరలించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ పండితులు ఫణిరామ్, వంశీకృష్ణలతో పాటు రామతీర్థం అర్చకులు ప్రత్యేక హోమాలను నిర్వహించిన తరువాత, గోమాత తోకలు కట్టిన తాడుతో విగ్రహాలను వాటి స్థానాల నుంచి కదిలించారు.ఆపై అధికారుల పర్యవేక్షణలో విగ్రహాలను కొండ కిందకు చేర్చారు. పోలీసులు ఈ కార్యక్రమంలో సాధారణ భక్తులను, ప్రజలను అనుమతించలేదు. ఇక ఆలయంలో పునఃప్రతిష్ఠించే కొత్త విగ్రహాలను టీటీడీ ప్రత్యేకంగా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విగ్రహాల తయారీ ఈ నెల 23 నాటికి పూర్తవుతుందని, ఆపై ఓ శుభ ముహూర్తాన ప్రతిష్ఠ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇక ఇదే సమయంలో కొండపై ఉన్న పురాతన ఆలయాన్ని ఆధునికీకరించడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

ఆలయం అభివృద్ధి నిమిత్తం రూ. 3 కోట్లు కేటాయిస్తున్నామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. మెట్ల మార్గాన్ని నూతనంగా నిర్మించడంతో పాటు, విద్యుత్ దీపాలు, భక్తులకు తాగు నీటి వసతి, స్వచ్ఛమైన కోనేరు, కొండపైకి శాశ్వత నీటి సరఫరా, కొండ చుట్టూ గ్రిల్స్, ప్రాకారం, హోమశాల, నైవేద్యాల తయారీ గదులు తదితరాలను నిర్మించనున్నారు.
Go Back to Shorts
Ramateertham
Idols
Andhra Pradesh

More Telugu News