NSO: కరోనా దెబ్బ: జీడీపీ 7.7% డౌన్​.. రికార్డ్​ స్థాయిలో పడిపోనున్న ఆర్థిక వృద్ధి!

  • నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి ఆర్థిక వృద్ధి
  • ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో పుంజుకునే అవకాశం
  • వ్యవసాయ రంగాల్లో 3.4% అధిక వృద్ధి
  • మిగతా అన్ని రంగాలపైనా ప్రతికూల పవనాలే
  • జాతీయ గణాంక సంస్థ అంచనా
GDP may contract drastically in FY21 says NSO data

కరోనా దెబ్బ మామూలుగా పడలేదు. మహమ్మారి ధాటికి దాదాపు అన్ని రంగాలూ కుదేలయ్యాయి. ఎంతో మందిని రోడ్డున పడేసింది. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థను పతనం చేసింది. ఇప్పుడు ఆ ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తిపై (జీడీపీ) పడింది. ఈ ఏడాది జీడీపీ 7.7 శాతం పడిపోతుందని జాతీయ గణాంక సంస్థ (ఎన్ ఎస్వో) అంచనా వేసింది. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల వల్ల ఆర్థిక వృద్ధి తగ్గిపోతుందని పేర్కొంది.

2019–20లో నమోదైన 11 ఏళ్ల కనిష్ఠ వృద్ధి 4.2 శాతంతో పోలిస్తే ఈ ఏడాది 7.7 శాతం తగ్గుతుందని చెప్పింది. ఇది దాదాపు నాలుగు దశాబ్దాల కనిష్ఠం కన్నా తక్కువ కావడం గమనార్హం. అంతకుముందు 1979–80 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5.2 శాతం పడిపోయింది. ఇప్పటిదాకా అదే అత్యధికం. ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ దానిని అధిగమించేసింది.

అయితే.. ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో వాస్తవ జీడీపీలో వృద్ధి నమోదవుతుందని, అక్టోబర్–మార్చి మధ్య వృద్ధి లోటు కేవలం 0.1 శాతమే ఉంటుందని గణాంక సంస్థ పేర్కొంది. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య నమోదైన 15.7 శాతం తగ్గుదలతో పోలిస్తే అది చాలా తక్కువని చెప్పింది.

వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో వృద్ధి గత ఏడాది కన్నా 3.4 శాతం ఎక్కువగా నమోదవుతుందని పేర్కొంది. 201–20 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ వృద్ధి 4 శాతంగా నమోదైంది. అయితే, మిగతా రంగాలపై మాత్రం ప్రతికూల పవనాలే వీస్తాయని వెల్లడించింది. 2020–21 ఏప్రిల్–జూన్ తర్వాత అన్ని రంగాలు కాస్త కోలుకున్నా.. ప్రభావం మాత్రం ఇంకా ఉంటుందని పేర్కొంది.

More Telugu News