Aisha Sha: బైడెన్ అధికార బృందంలో కశ్మీర్ అమ్మాయి

  • శ్వేత సౌధ డిజిటల్ వ్యూహ విభాగపు సభ్యురాలిగా ఐషా షా
  • పార్ట్ నర్ షిప్స్ మేనేజర్ గా నియమించిన జో బైడెన్
  • విభాగానికి కొత్త డైరెక్టర్ గా రాబ్ ఫ్లాహెర్తీ ఎంపిక
Kashmir born Aisha Shah named partnerships manager in Joe Biden White House digital team

అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అధికార బృందంలో మరో భారతీయురాలికి చోటు దక్కింది. కశ్మీర్ లో పుట్టి అమెరికాలోని లూసియానాలో పెరిగిన ఐషా షా అనే యువతికి ‘సీనియర్’ పోస్టును బైడెన్ అప్పగించారు. శ్వేతసౌధం డిజిటల్ వ్యూహ విభాగంలో పార్ట్ నర్ షిప్స్ మేనేజర్ గా ఆమెను నియమించారు. డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్ గా రాబ్ ఫ్లాహెర్తీని ఎంపిక చేశారు.

కాగా, బైడెన్-కమలా హ్యారిస్ ఎన్నికల ప్రచారంలో డిజిటల్ పార్ట్ నర్ షిప్స్ మేనేజర్ గా ఐషా షా పనిచేశారు. ప్రస్తుతం స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూట్ లో అడ్వాన్స్ మెంట్ స్పెషలిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు జాన్ ఎఫ్ కెన్నెడీ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కేంద్రంలో కార్పొరేట్ నిధి విభాగం  అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేశారు.

ఆమెతో పాటు డిజిటల్ స్ట్రాటజీ విభాగంలో మరికొందరినీ బైడెన్ నియమించారు. డిప్యూటీ డైరెక్టర్లుగా రెబెక్కా రింకెవిచ్, క్రిస్టియన్ టామ్, డిజిటల్ ఎంగేజ్ మెంట్ డైరెక్టర్ గా కామెరాన్ ట్రింబుల్, ప్లాట్ ఫాం మేనేజర్ గా బ్రెండన్ కోహెన్, డిజిటల్ పార్ట్ నర్ షిప్ మేనేజర్ గా మహా ఘాండౌర్, వీడియో డైరెక్టర్ గా జొనాథన్ హెబర్ట్, ప్లాట్ ఫాం డైరెక్టర్ గా జేమీ లోపెజ్, క్రియేటివ్ డైరెక్టర్ గా కెరానా మ్యాగ్ వుడ్, డిజైనర్ గా యాబీ పిట్జర్, ట్రావెలింగ్ కంటెంట్ డైరెక్టర్ గా ఒలీవియా రైజ్నర్ లను నియమించారు.

బృందంలో వైవిధ్యమైన నిపుణులున్నారని, వాళ్లకు డిజిటల్ వ్యూహాల్లో ఎనలేని అనుభవం ఉందని బైడెన్ చెప్పారు. కొత్తగా, సృజనాత్మక పద్ధతుల్లో అమెరికా ప్రజలకు శ్వేత సౌధాన్ని వారు మరింత దగ్గర చేస్తారని చెప్పారు. ఇంత మంచి టీంతో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

More Telugu News