Karnataka: కర్ణాటకలో పెను విషాదం.. రైలుకింద పడి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య

  • నిన్న ఇంటి నుంచి వెళ్లిపోయిన ధర్మెగౌడ
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ప్రధాని దేవెగౌడ
  • ఘటన స్థలం నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం
SL Dharmegowda Deputy Speaker of Legislative Council found dead

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ఎస్ఎల్ ధర్మెగౌడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ధర్మెగౌడ ఆచూకీ ఆ తర్వాత తెలియరాలేదు. దీంతో పోలీసులు,  గన్‌మెన్ ఆయన కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఈ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలూకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు. దీంతో రైలు కిందపడి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం పక్కనే ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధర్మెగౌడ ఆత్మహత్య విషయం తెలిసి మాజీ ప్రధాని దేవెగౌడ, జేడీఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఆయన ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు.

శాసనమండలి చైర్మన్ కె ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఈ నెల 16న శాసనమండలిలో రభస జరిగింది. సభ్యులు ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. సభాపతి స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ఇప్పుడు ధర్మెగౌడ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

More Telugu News