TTD: 25న ముక్కోటి ఏకాదశి.. ఈసారి పది రోజులపాటు తెరుచుకోనున్న తిరుమల వైకుంఠ ద్వారాలు

  • ఈసారి మరింత మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం
  • ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు భక్తులకు అనుమతి
  • సామాన్య భక్తుల కోసం రోజుకు 8 వేల టికెట్లు
  • ఇవి స్థానికులకు మాత్రమే
TTD to allow more devotees for vaikunta ekadasi

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈసారి సంప్రదాయానికి భిన్నంగా పది రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. అలాగే, ఆ పది రోజులు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్న టీటీడీ.. 25న ముక్కోటి ఏకాదశి నుంచి వచ్చే నెల 3న పంచమి వరకు వైకుంఠ ప్రదక్షిణలో భక్తులను అనుమతించనుంది.

ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఏర్పాట్లు చేస్తోంది. ఇక, ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు  ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను రోజుకు 20 వేల చొప్పున 2 లక్షల టికెట్లను ఈ నెల మొదటి వారంలో ఆన్‌లైన్‌లో ఉంచింది. అలాగే, శ్రీవాణి ట్రస్టు (రూ. 10 వేలు) కింద మరో 18 వేల టికెట్లను జారీ చేయగా, గంటల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

ఇక, సామాన్య భక్తుల కోసం రోజుకు 8 వేల టికెట్లను ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. దర్శనానికి ఒక రోజు ముందు నుంచి తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో వీటిని జారీ చేస్తారు. అయితే, ఇవి తిరుమల తిరుపతిలోని స్థానికులకే పరిమితం కానున్నాయి. ఇందుకోసం ఆధార్‌లోని చిరునామాను ప్రామాణికంగా తీసుకోనున్నారు. కాబట్టి ఇతర ప్రాంతాల వారు వచ్చి ఇబ్బంది పడొద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

మరోవైపు, కరోనా కారణంగా పది రోజులపాటు రోజుకు 35 వేల మందికే దర్శనం కల్పిస్తున్నామని, టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే స్వామి వారి దర్శనానికి రావాలని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి సూచించారు. స్థానికుల కోసం ఒక రోజు ముందు విడుదల చేస్తున్న సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖుల నుంచి సిఫార్సు లేఖలను స్వీకరించబోమన్నారు. 25న ఏకాదశి కృతువులు, స్వర్ణ రథోత్సవం, 26న ద్వాదశి సందర్భంగా చక్రస్నానం ఉంటాయని, 24 నుంచి 26 మధ్య కల్యాణోత్సవం, ఊంజల్, బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేసినట్టు ఆయన వివరించారు.

More Telugu News